
మొహర్రం ఉత్సవాలు ప్రారంభం
బత్తలపల్లి: మత సామరస్యానికి, హిందూ– ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచే మొహర్రం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గూగూడు తర్వాత ఆ స్థాయిలో మొహర్రం ఉత్సవాలు జరిగే బత్తలపల్లి ఆధ్యాత్మిక శోభను నింపుకుంది. మండల వ్యాప్తంగా వైభవంగా నిర్వహించే మొహర్రం ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. బత్తలపల్లిలోనూ ఖాసీంస్వామి(మొహర్రం) ఉత్సవాలను గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఉదయం గ్రామ పెద్దల సమక్షంలో పీర్లను భద్రపరిచే పెట్టెను కిందకు దించి ముజావర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుండం తీసి వేడుకలకు అంకురార్పణ చేశారు. రాత్రి ఖాశీంస్వామి ప్రథమ దర్శనంతో భక్తులు పులకించారు.
పదిరోజుల పాటు ఉత్సవాలు
ఉత్సవాలు పదిరోజుల పాటు వైభవంగా జరుగుతాయని ముజావర్లు(పూజారులు) తెలిపారు. జూలై 2నఐదవ సరిగెత్తు, 4న చిన్నసరిగెత్తు(పానకాలు), 5వ తేదీ ఉదయం గ్రామోత్సవం, 6న పెద్ద సరిగెత్తు, 7నఅగ్నిగుండ ప్రవేశం... జలధికి ఉత్సవం ఉంటుందన్నారు.
భక్తులకు కాశీంస్వామి తొలిదర్శనం

మొహర్రం ఉత్సవాలు ప్రారంభం