
జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దాం
ప్రశాంతి నిలయం: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడటంతో పాటు జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని హిందూపురం పార్లమెంట్ సభ్యుడు, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్ బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్, ఎంపీ బీకే పార్థసారథి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మెంబర్ సెక్రెటరీ, కలెక్టర్ టీఎస్ చేతన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీకే పార్థసారథి మాట్లాడుతూ.. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రాష్ట్రంలోని 67 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని, సాంకేతిక లోపాలవల్ల కొందరు పథకం పొందలేకపోయారన్నారు. ‘పీఎం కిసాన్ సన్మాన్’ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి రూ.6 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద అదనంగా రూ.14 వేలు ఆర్థిక లబ్ధి కలుగుతుందన్నారు. అర్హులు ఉంటే వెంటనే గుర్తించాలన్నారు. వార్షిక ప్రీమియం రూ.456 చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షల బీమా లబ్ధి కలుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరై పూర్తయిన పనులను గుర్తించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని డ్వామా పీడీని ఆదేశించారు. జిల్లాలో రూ.3 వేల కోట్లతో చేపట్టిన జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలన్నారు.
పింఛన్లపై విచారణ చేయించండి..
గతంలో మంజూరైన పింఛన్లపై సమగ్ర విచారణ జరిపి అర్హులకు మాత్రమే పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సభలను ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయుల స్థానంలో వెంటనే మరొకరిని నియమించాలన్నారు.
మూడు నెలలకోసారి సమావేశం..
కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ... ప్రతి మూడు నెలలకు ఒకసారి ‘దిశ’ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. కేంద్రం నిధులతో చేపట్టిన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, వాటి లోపాలను దిశ కమిటీ సమావేశంలో చర్చిస్తామన్నారు. ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకొని కేంద్రానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో పుట్టపర్తి, కదిరి, మడకశిర ఎమ్మెల్యేలు పల్లె సింధూరా రెడ్డి, కందికుంట వెంకటప్రసాద్, ఎంఎస్ రాజు, ఎస్పీ వి.రత్న, డీఆర్డీఏ పీడీ నరసయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటనారాయణ, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి వంశీకృష్ణారెడ్డితోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘దిశ’ సమావేశంలో చైర్మన్ బీకే పార్థసారధి