
శ్రీచైతన్యలో ఎల్కేజీ, యూకేజీ తరగతుల సీజ్
హిందూపురం టౌన్: పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఎంఈఓ గంగప్ప శుక్రవారం ఆయా తరగతులను సీజ్ చేశారు. కాగా, శుక్రవారం ఉదయం ఆ పాఠశాలను వైఎస్సార్ ఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు కదిరీష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తుండడంతో ఎంఈఓకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విద్యార్ధి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. శ్రీచైతన్య పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి రూ.22వేల నుంచి రూ25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలోనే పుస్తకాలు, యూనిఫాం, టై, షూ, బ్యాగులను శ్రీచైతన్య పాఠశాల పేరుతో ముద్రించి ఇక్కడే కొనాలని నిబంధన పెట్టి దాదాపు రూ.8500ల వరకు వసూలు చేశారన్నారు. ఎంఈఓ గంగప్ప మాట్లాడుతూ.. శ్రీచైతన్య పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు అనుమతులు లేవని, ఇకపై నిర్వహించకూడదని అన్నారు. కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు చంద్రశేఖర్, భరత్, సాయిరాం, అనుదీప్, ఫణి, నాజీర్, శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.