
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు పి.నారాయణస్వామితో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు.అగ్రిగోల్ బాధితులను ఆదుకునే అంశాన్ని టీడీపీ తన ఎన్నికల మేనిఫేస్టోలో ఉంచిందని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం ద్వారా విక్రయించి బాధితులకు న్యాయం చేస్తామని అప్పట్లో చంద్రబాబు చెప్పి ఏడాదవుతున్నా అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ సంస్థ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. హామీని అమలు చేయకపోతే బాధితులతో కలిసి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధేశ్వర్, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, సభ్యులు కుళ్లాయప్ప, ధనుంజయ, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.