
కుక్కల దాడిలో గొర్రెల మృతి
పుట్లూరు: వీధి కుక్కల దాడిలో 37 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు.. పుట్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు గొర్రెల పెంపకం చేపట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద గొర్రెలను దొడ్డిలో ఉంచేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గొర్రెలను దొడ్డిలో వదిలి ఇంటికెళ్లి నిద్రించాడు. శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకునేలోపు దాదాపు 10 కుక్కలు చుట్టుముట్టి గొర్రెలపై దాడి చేస్తుండడాన్ని గమనించి, వాటి అదలించేలోపు 37 గొర్రెలు మృతి చెందాయి. జీవనాధారంగా ఉన్న గొర్రెల మృతితో శ్రీనివాసులు కన్నీటిపర్యంతమయ్యాడు. అప్పులు చేసి ఇటీవల గొర్రెలను కొనుగోలు చేశానని, ఘటనతో రూ.3 లక్షలు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ అలివేలమ్మ, డిప్యూటీ తహసీల్దార్ మహబూబ్బాషా, వీఆర్వో వెంకటనారాయణ, పంచాయతీ కార్యదర్శి సంధ్య అక్కడకు చేరుకుని పరిశీలించారు. పశువైద్యాధికారితో పంచనామా నిర్వహించి, నివేదిక సిద్ధం చేయించారు. గొర్రెల మృతితో నష్టపోయిన శ్రీనివాసులును ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గ్రామస్తులు డిమాండ్ చేశారు.