
సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలు నిల్
● తేల్చి చెప్పిన భద్రతా కమిటీ సభ్యులు
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం లేవని, అత్యంత కీలకమైన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ వృథాగా ఉందని, సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో పాటు సెక్యూరిటీ అంతంత మాత్రంగానే ఉందని సెక్యూరిటీ వింగ్ ఆడిట్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సెక్యూరిటీ వింగ్ ఆడిట్ కమిటీ సభ్యులైన డీఎస్పీ సాయిరాం (విజయవాడ), ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ లింగమయ్య, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖాధికారులు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలపై అణువణువూ తనిఖీ చేశారు. రూ.2.2 కోట్లతో ఏర్పాటు చేసిన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ నిరుపయోగంగా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఏమైనా అగ్రిప్రమాదం జరిగితే ప్రస్తుతం ఉన్న ఫైర్ ఫైటింగ్ సిస్టమ్తో ఎటువంటి ఉపయోగమూ లేదన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అదేవిధంగా ఆస్పత్రిలో చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పూర్తిగా లేవని తెలుసుకున్నారు. వివిధ వార్డులకు సెక్యూరిటీ లేకపోవడాన్ని గమనించారు. పార్కింగ్కు స్థలం లేదని, బైక్లు, కార్లు, అంబులెన్స్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని గుర్తించారు. వాహనాలు ఎప్పుడైనా అగ్నిప్రమాదానికి గురైతే రోగులు, వారి సహాయకులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి, వైద్య కళాశాల చుట్టూ ప్రహరీని పకడ్బందీగా ఉంచేలా చూడాలన్నారు. అనంతరం డీఎస్పీలు సాయిరాం, నీలకంఠేశ్వర రెడ్డి సూపరింటెండెంట్ను కలిశారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాలు అదనంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాయిస్ సీసీ కెమెరాలను అందుబాటులో తేవాలన్నారు. అదేవిధంగా వైద్యులపై దాడులకు పాల్పడితే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసేలా చట్టాలున్నాయన్న బోర్డులను వివిధ వార్డుల్లో ఏర్పాటు చేయాలన్నారు.