
వివాహిత హత్య కేసులో వీడిన మిస్టరీ
పుట్లూరు: గత ఏడాది అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివాహిత కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్తే కాలయముడై ఆమెను హతమార్చినట్లుగా నిర్ధారించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. పుట్లూరు పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ సత్యబాబు వెల్లడించారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా దింబల్గుడి గ్రామానికి చెందిన సంగీత (21), నాగరాజు దంపతులు బతుకు తెరువు కోసం పుట్లూరు మండలానికి వలస వచ్చారు. ఎ.కొండాపురం గ్రామంలో నివాసముంటూ కూలి పనులతో జీవనం సాగించేవారు. గత ఏడాది అక్టోబర్ 15న సంగీత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గొంతు నులిమి హతమార్చినట్లుగా అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలతో గురువారం భర్త నాగరాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో తన భార్యపై అనుమానంతో గొంతు నులిమి తానే హతమార్చినట్లుగా అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుడి అరెస్ట్లో చొరవ చూపిన ఎస్ఐ వెంకటనరసింహ, సిబ్బందిని సీఐ సత్యబాబు అభినందించారు.
గత ఏడాది అక్టోబర్లో
వివాహిత అనుమానాస్పద మృతి
హత్యగా నిర్ధారించిన పోలీసులు
నిందితుడి అరెస్ట్