
ఘర్షణ కేసులో పలువురి అరెస్ట్
పుట్టపర్తి టౌన్: ఆరు రోజుల క్రితం కొత్తచెరువులో స్థల వివాదంలో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ మారుతీప్రసాద్ తెలిపారు. పుట్టపర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. కొత్తచెరువు గ్రామానికి చెందిన దాల్మిల్ సూరి, మహాలక్ష్మి దంపతులు ఐదేళ్ల క్రితం స్థానిక ధర్మవరం రోడ్డులోని సర్వే నంబర్ 446లో 7.65 ఎకరాల భూమిని అనంతపురంలోని వేణుగోపాలనగర్కు చెందిన తిరుమలశెట్టి గారి సుశీలమ్మకు విక్రయించారు. అయితే ఆ భూమిని అప్పగించకుండా వేధిస్తూ వచ్చారు. దీనిపై ఈ నెల 7న సుశీలమ్మ గట్టిగా నిలదీసింది. ఆ సమయంలో ఘర్షణ పడిన సూరి, మహాలక్ష్మి దంపతులు తమ అనుచరులతో కలసి సుశీలమ్మ కుమారుడు సాగర్రెడ్డి, ఇద్దరు డ్రైవర్లు, మరో ఏడుగురు కూలీలపై ఐరన్ రాడ్లు, కట్టెలు, రాళ్లతో దాడి చేశారు. ఘటనలో గాయపడిన తొమ్మిదిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అదే రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోల ఆధారంగా దాడికి పాల్పడిన చిన్నకుళ్లాయప్ప, వెల్లూరు ఆంజనేయులు, వలిపి పెద్దన్న, బండ్లపల్లి ఆదినారాయణ, మహేష్ను శుక్రవారం మధ్యాహ్నం కొత్తచెరువు మార్కెట్ యార్డ్ సమీపంలో అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరికొందరిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.