కాలుతున్న పచ్చదనం | - | Sakshi
Sakshi News home page

కాలుతున్న పచ్చదనం

Jun 13 2025 4:59 AM | Updated on Jun 13 2025 4:59 AM

కాలుత

కాలుతున్న పచ్చదనం

చిలమత్తూరు: జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో పచ్చదనం కాలి బూడిదవుతోంది. అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిశ్రమల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వేప, చింత, కానుగ వృక్షాల నరికవేతను ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో పచ్చదనం కరువవుతోంది.

హిందూపురం పరిసరాల్లోనే ఎక్కువ..

హిందూపురం రూరల్‌ మండలం తూముకుంట, గొళ్లాపురం పారిశ్రామికవాడలోని పలు ఫ్యాక్టరీలు, గార్మెంట్స్‌ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల నిర్వహణకు అవసరమైన కలప కోసం హిందూపురం పరిసర ప్రాంతాలతో పాటు శివారున ఉన్న కర్ణాటక ప్రాంతంలో పెద్ద ఎత్తున చెట్లను నరికి తరలిస్తున్నారు. గొళ్లాపురం, తూముకుంట పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో భారీ వృక్షాలకు సంబంధించిన కలప పెద్ద ఎత్తున డంప్‌ చేసి ఉండడం కలకలం రేపుతోంది. సాధారణంగా పరిశ్రమల్లో ఉత్పత్తుల కోసం కలపను బాయిలింగ్‌ చేయాల్సి వస్తోంది. ఇందుకోసం బ్రికెట్‌ను వినియోగించాల్సి ఉంది. అయితే బ్రికెట్‌ విలువ టన్నుకు రూ. 8 వేలు ఉండడంతో దానికి బదులు కలపనే పరిశ్రమల నిర్వాహకులు ఎంచుకున్నారు. ఫైర్‌ వుడ్‌కు సంబంధించి అనుమతులు పొంది నిబంధనలకు వ్యతిరేకంగా స్మగ్లర్ల ద్వారా వేప, చింత, కానుగ, ఇతర భారీ వృక్షాలను అడ్డగోలుగా నరికి పరిశ్రమకు తరలించి డంప్‌ చేస్తున్నారు. ఈ అక్రమాలు బయటకు పొక్కుండా కలపనంతా పొడి చేసి పెడుతున్నారు. ఈ విషయాన్ని బయట పెడితే పని నుంచి తొలగిస్తామని కార్మికులు బెదిరించినట్లుగా సమాచారం. వృక్ష సంపద కరిగి పోతున్న విషయం అటవీ అధికారులకు తెలిసినా... దీనిని తమ ఆదాయ వనరుగా మార్చకుని నోరు మెదపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మొక్కల పెంపకానికి రూ.కోట్లు కుమ్మరించే ప్రభుత్వాలు, ఉన్న వృక్ష సంపదను కాపాడేందుకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమల్లో ఇష్టానుసారంగా

కలప వినియోగం

అడ్డగోలుగా వేప, చింత,

కానుగ వృక్షాల నరికివేత

పట్టించుకోని అటవీ అధికారులు

ఫైర్‌వుడ్‌కు అనుమతులిచ్చాం

తూముకుంట, గొళ్లాపురం పారిశ్రామికవాడలో ఫైర్‌ వుడ్‌ వినియోగించేలా విరిగో పరిశ్రమతో పాటు కొన్ని గార్మెంట్స్‌కు కూడా అనుమతులు ఇచ్చాం. వాళ్లు ఏ సమయంలోనైనా పరిశ్రమలకు ఫైర్‌ వుడ్‌ను దిగుమతి చేసుకోవచ్చు. ఫైర్‌ వుడ్‌ కాకుండా ఇతర కలప వినియోగిస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేపడతాం. వాస్తవాలు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసరెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ

రాత్రి పూటే ఎక్కువగా

పరిశ్రమల్లో ఫైర్‌ వుడ్‌ బదులు కలపను వినియోగిస్తున్నారు. హిందూపురం పరిసరాలతో పాటు శివారున ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి రాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున కలప ఆయా పరిశ్రమలకు చేరుతోంది. అనుమతులు ఉన్న వాటిని పగటి సమయంలో దిగుమతి చేసుకుంటుంటారు. ఈ అంశంపై ఇటీవల అటవీ అధికారులు పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టారు. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

– రవికుమార్‌, కార్మికసంఘం నేత

కాలుతున్న పచ్చదనం 1
1/2

కాలుతున్న పచ్చదనం

కాలుతున్న పచ్చదనం 2
2/2

కాలుతున్న పచ్చదనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement