
ఆర్డీటీపై ఆంక్షలు ఎత్తివేయాలి
కళ్యాణదుర్గం: ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ డిమాండ్ చేశారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రకు గురువారం ఆయనతో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మద్దతు తెలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఆర్డీటీ వరదాయినిగా ఉందన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతూ పేదలకు అన్ని విధాలుగా అండగా ఉందన్నారు. ఆర్డీటీని కాపాడుకునేందుకు జిల్లాలో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు, సీఎం చంద్రబాబు ఇప్పటికై నా కళ్లు తెరవాలన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి ఆర్డీటీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఆర్డీటీ లేకపోతే జరిగే నష్టాన్ని గుర్తించి ఆ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం రంగయ్య పాదయాత్ర చేపట్టడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వమే స్వయంగా వచ్చి పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించినా ప్రజల సహకారంతో రంగయ్య పాదయాత్ర ముందుకెళ్తోందన్నారు. ప్రజలు సమైక్యంగా పాదయాత్రకు కదలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, ఎంపీపీ భీమేష్, మండల కన్వీనర్ హనుమంతరాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడుతో పాటు పలువురు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ఆర్డీటీ లబ్ధిదారులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శంకరనారాయణ,
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్