
కిడ్నాపర్ బారి నుంచి తప్పించుకున్న బాలిక
హిందూపురం టౌన్: రామగిరి మండలంలో దళిత మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటన మరువక ముందే హిందూపురంలో ఓ బాలిక కిడ్నాప్ ఉదంతం సంచలనం రేకెత్తించింది. కిడ్నాపర్ బారి నుంచి తప్పించుకున్న బాలిక నాటకీయ పరిణామాల మధ్య తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేరింది. ఇందుకు హిందూపురంలోని అల్ ఇందాద్ ట్రస్ట్ పూర్తి స్థాయిలో సహకరించింది. వివరాలు... గురువారం ఉదయం హిందూపురానికి చెందిన పదేళ్ల వయసున్న ఓ బాలికను ఐస్క్రీం, చాక్లెట్లు ఇప్పిస్తానంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వెంట పిలుచుకెళ్లాడు. లేపాక్షి – నగరిగెర గ్రామాల మధ్య ఉన్న వైన్ షాప్ వద్దకు చేరుకున్న తర్వాత ఆ బాలికను బయట ఉండమని చెప్పి వైన్ షాపులోకి వెళ్లాడు. అప్పటికే అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాలిక అవకాశం కోసం దొరకగానే తప్పించుకుంది. ఒంటరిగా రహదారిపై కనిపించిన బాలికను గమనించిన ఆటో డ్రైవర్ రామాంజి.. వెంటనే వివరాలు ఆరా తీసి, సురక్షితంగా లేపాక్షికి చేర్చాడు. అక్కడ తనకు పరిచయమున్న బాబా అనే వ్యక్తి విషయం తెలపడంతో ఆయన ద్వారా సమాచారం అందుకున్న అల్ ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అమన్, సభ్యులు సాదిక్, రహన్, బాబా ఫకృద్దీన్, మొయిన్, ఆరీఫ్, రామాంజినేయులు తదితరులు లేపాక్షికి వెళ్లి బాలికకు ధైర్యం చెప్పారు. గురువారం సాయంత్రం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలికలు, యువతులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నాపర్ బారి నుంచి బాలిక సురక్షితంగా బయటపడిన విషయం తెలుసుకున్న ఊపిరి పీల్చుకున్నారు.