
ఆర్టీసీని లాభాల బాట పట్టిద్దాం
పుట్టపర్తి టౌన్: టికెట్ ఆదాయంతో పాటు పర్యాటక కేంద్రాలకు అదనపు బస్సులు నడిపి ప్రతి డిపో పరిధిలోనూ నష్టాలు తగ్గించి, ఆర్టీసీని లాభాల బాట పట్టిద్దామని డీపీటీఓ మధుసూదన్ పిలుపునిచ్చారు. ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే మార్గాలపై తన కార్యాయంలో జిల్లాలోని అన్ని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్ సిబ్బంది, అకౌంట్స్ విభాగం సూపర్వైజర్లతో గురువారం ఆయన సమీక్షించారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచి జిల్లాను ప్రథమ స్ధానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమయపాలన పాటించాలన్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కారం చూపాలని డిపో మేనేజర్లను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి డ్రైవర్ కృషి చేయాలన్నారు. ప్రతి బస్ స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీరు, బస్ టైమింగ్ బోర్డులు, శుభ్రమైన టాయిలెట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పర్యాటక కేంద్రాలకు రద్దీని బట్టి అదనపు బస్సులు నడపాలన్నారు. కార్గో ఆదాయాన్ని మరింత పెంచాలన్నారు.