
‘ప్రిఫరెన్షియల్’లో దుర్వినియోగం
అనంతపురం ఎడ్యుకేషన్: డీఈఓ కార్యాలయ సిబ్బంది నిర్వాకం కారణంగా ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ దుర్వినియోగమైందని డీఈఓ ప్రసాద్బాబుకు పలువురు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. బుధవారం డీఈఓను కలిసి ఆధారాలను అందజేశారు. నగరంలోని కేఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్ఏ ఇంగ్లిష్కు సంబంధించి ఆరు పోస్టులున్నాయన్నారు. కొత్త బదిలీల చట్టం ప్రకారం 50 శాతం అంటే వీటిలో మూడు పోస్టులు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చూపించాల్సి ఉండగా... ఏకంగా ఐదు పోస్టులను ఇచ్చారన్నారు. ఈ కారణంగా సీనియారిటీ జాబితాలో మిగిలిన టీచర్లకు చాలా నష్టం వాటిల్లిందని, ఈ అంశంపై డీఈఓకు గ్రీవెన్స్ ఇచ్చినా సమస్యకు పరిష్కారం చూపలేదని మండిపడ్డారు. పీహెచ్ (అంధులు) కేటగిరీ కింద ధర్మవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆదిమూలం శ్రీనివాసులు ప్రస్తుత బదిలీలో తప్పనిసరిగా ఉన్నారన్నారు. అయితే ఆయన పీహెచ్ కేటగిరీని వదిలి జనరల్ కేటగిరీకి దరఖాస్తు చేసుకుంటున్నట్లు తన ఇష్టపూర్వక లేఖను సమర్పించారన్నారు. ఈ లెక్కన ఆయన పేరును జనరల్ కేటగిరీలో చూపాల్సి ఉందన్నారు. అతను జనరల్ కేటగిరీలోకి వస్తే, తర్వాత ఉన్న మహిళా టీచర్ను బాలికల పాఠశాలకు కేటాయించకుండా పురుష టీచరును నియమించారన్నారు. చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న జిల్లా పరిషత్ యాజమాన్య టీచర్లు తిరిగి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలను ఎంచుకున్నారన్నారు. వీటిపై అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఎస్ఏ ఇంగ్లీష్ కె.సురేష్బాబు జెడ్పీ నుంచి కదిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, రంగస్వామిని గుంతకల్లులోని ప్రభుత్వ పాఠశాల, గణితం టీచరు డి.అమరేంద్రకుమార్ రెడ్డిని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారన్నారు. అలాగే ఎస్ఏ సోషల్ కె.మాదార్బీని ఉరవకొండ ప్రభుత్వ పాఠశాలకు బదిలీ చేశారన్నారు. అక్రమ బదిలీలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. తర్వాత సీనియారిటీలో ఉన్న అర్హులైన ఉపాధ్యాయులకు ఆ స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యాలయ సిబ్బంది నిర్వాకంపై డీఈఓకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులు