
ప్రమాదంలో చిన్నారి మృతి
బత్తలపల్లి: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై తల్లిదండ్రులతో కలసి వెళుతున్న చిన్నారి మృతి చెందింది. వివరాలు.. బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన చాకలి నరసింహులు, మణికంఠేశ్వరి దంపతులు బుధవారం ఏడాది వయసున్న తమ చిన్నారి తన్మయితో కలిసి ద్విచక్ర వాహనంలో ధర్మవరం వెళ్లారు. అక్కడ పని ముగించుకున్న అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. ధర్మవరం మండలం సుబ్బారావుపేట గ్రామం దాటిన తర్వాత ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో తలిదండ్రులతో పాటు చిన్నారికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలిస్తుండగా తన్మయి(1) మృతి చెందింది. తల్లిదండ్రులకు నడుము, కాళ్లు విరిగాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, ఈడిగ కాశప్ప, లింగమయ్య, ఈశ్వరయ్య, బండి నాగభూషణ, వెంకటరాముడు తదితరులు బాధితులను పరామర్శించారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
తనకల్లు: మండలంలోని ముత్యాలవారిపల్లిలో ఈ నెల 3న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన పుప్పాల గిరిష్బాబు, సంధ్యారాణి దంపతుల కుమారుడు నిశాంత్ (3) అక్కడికి సమీపంలోని నీటి సంప్లో పడి మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన రోజే బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. అయితే బాలుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన ఎస్ఐ గోపి... బుధవారం స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి గ్రామానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని వెలికి తీయించి అక్కడే పోస్టుమార్టం జరిపించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.