
పేరుకే మహా ప్రస్థానం
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో నాలుగు మహాప్రస్థానం వాహనాలు ఉండగా ఇందులో ఏ ఒక్కటీ అత్యవసరం సమయంలో నిరుపేదలకు ఉపయోగ పడడం లేదు. సర్వజనాస్పత్రికి చికిత్స కోసం వచ్చిన కంబదూరు మండలం పి.వెంకటాంపల్లికి చెందిన హరిజన మారెక్క(48) బుధవారం మృతి చెందింది. దీంతో వార్డు గోడలపై ఉన్న మహాప్రస్థానం వాహనం కోసం ఉదయం 9.30 గంటలకు మృతురాలి కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. అయితే మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేదని, రావడానికి రాత్రి 7 గంటలవుతుందని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఫోన్ కట్ చేశాడు. దీంతో మారెక్క కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులను సంప్రదించారు. బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు. పలుమార్లు ప్రాధేయపడిన తర్వాత చివరకు రూ.5,500తో ఒప్పుకుని మృతదేహాన్ని తరలించేందుకు ముందుకు వచ్చారు. ఆస్పత్రిలో రోజూ 6 నుంచి 10 మంది మృత్యువాత పడుతున్నారు. ఈ మృతదేహాలను తరలించేందుకు గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ తలారి రంగయ్య తన కోటా నిధుల్లో నుంచి రూ.10 లక్షలు వెచ్చించి మహాప్రస్థానం వాహనాన్ని సమకూర్చారు. ఈ వాహనాన్ని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అయితే ఆ వాహనానికి ఇంధనం సమకూర్చకపోవడంతో మూలన పడింది. ఇదే విషయమై ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. త్వరలో వాహనం రెగ్యులర్గా తిరిగేందుకు ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేసేలా కలెక్టర్కు విన్నవించనున్నట్లు పేర్కొన్నారు.