
డైయాలసిస్
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలోనే దారుణమైన పరిస్థితులు
డయాలసిస్ చేసే సమయంలో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం
నాలుగు నెలలుగా పనిచేయని జనరేటర్
ప్రాణాలు ఉగ్గపట్టుకుంటున్న రోగులు
కిడ్నీ బాధితులకు చికిత్సలో భాగంగా కీలకంగా అందజేసే డయాలసిస్ ప్రక్రియ అవసానదశలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సొంత నియోజకవర్గ కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి దుర్భర పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ధర్మవరం అర్బన్: డయాలసిస్ అనగానే గుండె గుభేలుమంటుంది! మరణానికి చేరువైపోయామోననే భావన రోగుల్లో వ్యక్తమవుతుంటుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించే మూత్రపిండాలు మొరాయిస్తే, వాటి పనిని యంత్రాలకు అప్పగించడమే డయాలసిస్. దాదాపు 80 శాతం పాడయ్యేవరకూ కిడ్నీలు తమ విధిని సక్రమంగానే నిర్వహిస్తాయి. ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా పని చేయడానికి మొండికేస్తాయి. దీనినే వైద్య పరిభాషలో ‘కిడ్నీ ఫెయిల్యూర్’ అంటారు. ఇలాంటి సమయంలో రోగి బతకాలంటే ‘డయాలసిస్’ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం రోగుల ప్రాణాలకు భరోసానివ్వలేకపోతోంది. డయాలసిస్ చేసే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుని యంత్రాలు ఆగిపోతున్నాయి. దీంతో రోగులు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. ఆయాసం ఎక్కువై ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ప్రాణాలు ఉగ్గబట్టుకోవాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొంటోంది.
నాలుగు నెలలుగా పనిచేయని జనరేటర్
ధర్మవరంలోని మారుతీనగర్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాతాశిశు సంరక్షణ కేంద్రం నూతన భవనాన్ని నిర్మించి, ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేంద్రంలోనే ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. కేంద్రం నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీకు అప్పగించారు. ఏజెన్సీ ద్వారా రోజూ 5 నుంచి 15 మంది రోగులకు డయాలసిస్ నిర్వహిస్తుంటారు. డయాలసిస్ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండరాదు. అయితే నాలుగు నెలలుగా విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం చోటు చేసుకుంటుండంతో డయాలసిస్ రోగులు నరక యాతన అనుభవిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని అధిగమించేలా ఏర్పాటు చేసిన జనరేటర్ సైతం పనిచేయడం లేదు. దీంతో ఒక్కో రోగికి డయాలసిస్ ప్రక్రియ పూర్తి చేయడానికి పది గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది.
పట్టించుకోని ఏజెన్సీ
డయాలసిస్ సెంటర్లో జనరేటర్ పనిచేయడం లేదనే అంశాన్ని రహి కేర్ ఏజెన్సీకి సిబ్బందితోపాటు కిడ్నీ బాధితులూ ఫోన్ చేసి చెప్పినా ఫలితం లేకపోయింది. ఏజెన్సీ మేనేజర్ వీరా నిర్లక్ష్యపు సమాధానాలతో ఫోన్ కట్ చేస్తున్నాడని పలువురు రోగులు వాపోతున్నారు. ఇదే అంశాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని రోగులు కోరారు. అయినా అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది.
మౌలిక సౌకర్యాలు లేవు
డయాలసిస్ సెంటర్ను భవనం పై అంతస్థులో ఏర్పాటు చేయడంతో నడవలేని స్థితిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెంటర్లో ఉన్న ఒక్క వీల్ఛైర్ సరిగా లేదు. కిడ్నీ రోగులకు డయాలసిస్ చేసే సమయంలో అనారోగ్యానికి గురైతే వెంటనే ఆక్సిజన్ పెట్టాల్సి ఉంది. అయితే సెంటర్లో ఆక్సిజన్ సౌకర్యం లేదు. రోగి తీవ్ర అనారోగ్యానికి గురైతే వెంటనే మరో ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ సదుపాయం కూడా లేదు. సెంటర్లో కనీసం తాగేందుకు మంచినీరు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులతో పాటు వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదిరోజుల క్రితం రోగి మృతి
ధర్మవరంలోని కదిరిగేటు సమీపంలో ఉండే కిడ్నీ బాధితుడు రెడ్డప్పకు డయాలసిస్
చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపోయింది. జనరేటర్ లేకపోవడంతో కరెంటు వచ్చే వరకూ వేచి ఉన్నాడు. ఆ సమయంలో ఆయాసం ఎక్కువై తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపు మృతిచెందాడు. విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండి ఉన్నా... లేదా, జనరేటర్ పనిచేసి ఉన్నా రెడ్డప్ప ప్రాణాలతో ఉండేవాడని కిడ్నీ బాధితులు అంటున్నారు.
ఎప్పుడు పోతుందో చెప్పలేం
డయాలసిస్ చేసే సమయంలో తరచూ కరెంటు పోతోంది. దీంతో నాలుగు గంటలు సమయం పట్టే డయాలసిస్కు 10 గంటలవుతోంది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. డయాలసిస్ చేసే సమయంలో కరెంటు పోతే మాకు శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక నరక యాతన అనుభవిస్తుంటాం. అధికారులు స్పందించి జనరేటర్ను బాగు చేయించాలి. – నాగరత్న, కిడ్నీ బాధితురాలు, గొట్లూరు గ్రామం, ధర్మవరం
వారానికి మూడుసార్లు వస్తున్నా
నా ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఫిబ్రవరి నుంచి వారానికి మూడుసార్లు డయాలసిస్కి వస్తున్నా. డయాలసిస్ సమయంలో కరెంటు పోతే ఆయాసం పెరిగి పోతోంది. బీపీ తగ్గిపోయి, షుగర్ లెవల్స్ పడిపోయి కాళ్లు, చేతులు వాపులు వస్తున్నాయి. జనరేటర్ పనిచేయడంలేదని రహి కేర్ ఏజెన్సీ వారికి ఫోన్ చేస్తే పట్టించుకోవడంలేదు. విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేస్తే మాకేమి సంబంధం అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. పదిరోజుల క్రితం రెడ్డప్ప అనే రోగికి డయాలసిస్ చేసే సమయంలో కరెంటు పోయి చనిపోయాడు. ఆక్సిజన్ లేకపోవడంతోనే అతను చనిపోయినట్లుగా తెలిసింది. ఈ పరిస్థితి మరొకరికి రాకుండా చర్యలు తీసుకోవాలి.
– ప్రభాకర్, కిడ్నీ బాధితుడు, ధర్మవరం
ప్రాణాలు పోయే పరిస్థితి
కిడ్నీలు చెడిపోయి సగం ప్రాణంతో బతుకుతున్నాం. డయాలసిస్ చేయించుకుంటునే మాకు బతుకు. అయితే గంటల కొద్ది కరెంటు పోతోంది. దీంతో డయాలసిస్ చేసే సమయంలో మిషన్లు ఆగిపోతున్నాయి. జనరేటర్ కూడా పనిచేయడం లేదు. ఇప్పటికై నా డయాలసిస్ కేంద్రానికి విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– నారాయణస్వామి, కిడ్నీ బాధితుడు, మల్కాపురం

డైయాలసిస్

డైయాలసిస్

డైయాలసిస్

డైయాలసిస్

డైయాలసిస్