
ఆరు టన్నుల చీనీ కాయల అపహరణ
బత్తలపల్లి: పక్వానికి వచ్చిన ఆరు టన్నుల చీనీ కాయలను రాత్రికి రాత్రే దుండగులు అపహరించుకెళ్లారు. వివరాలు.. బత్తలపల్లి మండలం తిమ్మనకొట్టాల గ్రామానికి చెందిన ఎరికల గోపాల్.. డి.చెర్లోపల్లి సమీపంలోని సర్వే నెంబర్ 468లో తనకున్న పది ఎకరాల్లో నుంచి మూడు ఎకరాలు వరి సాగు చేయగా, మిగిలిన ఏడు ఎకరాల్లో చీనీ పంట సాగు చేస్తున్నాడు. పదేళ్లుగా పంట చేతికి అందుతోంది. ఈ సారి కూడా పక్వానికి వచ్చిన కాయలను రెండు రోజుల తరువాత తొలగించాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం సాయంత్రం తోటలోకి వెళ్లి చూడగా 150 చెట్లలోని సుమారు ఆరు టన్నుల చీనీకాయలను అపహరించుకెళ్లినట్లుగా గుర్తించాడు. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.2.10 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. కాగా, పది రోజుల క్రితం మాలగుండ్లపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి తోటలోని చీనీకాయలను కూడా దుండగులు అపహరించిన వైనం మరువక ముందే ఎరికల గోపాల్ తోటలో కాయలు అపహరణకు గురి కావడంతో రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఘటనపై బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మోదీ పాలన స్వర్ణ యుగం
● రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్
అనంతపురం టవర్క్లాక్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచిందని, ఈ 11 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ పటిష్టం చేసి స్వర్ణ యుగంలా మార్చాడని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్కరణల అమలుతో దేశాభివృద్ధికి ప్రధాని మోదీ బాటలు వేశారన్నారు. ప్రధానంగా రైతులు, పేదలు, యువకులు, మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేశారన్నారు. ఇటీవల పాకిస్తాన్ విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు విద్రోహులను ముప్పతిప్పలు పెట్టాయన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ తోక ముడిచేలా చేశారన్నారు. సాధ్యం కాని ఎన్నో పనులను ఆచరణలో పెట్టి చూపారన్నారు. అధికారం కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకునేలా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని పేర్కొన్నారు.
భూసార పరీక్షలు చేయించుకోండి
పుట్టపర్తి అర్బన్: రైతులే స్వయంగా తమ పొలాల్లోని మట్టిని తీసుకెళ్లి భూసార పరీక్షలు చేయించుకుని పంటల సాగు చేపట్టాలని జాతీయ నూనె గింజల పరిశోధనా స్థానం డాక్టర్ దొరై మురుగన్, కేవీకే రెడ్డిపల్లి శాస్త్రవేత్త డాక్టర్ త్రికళ మాధవి అన్నారు. వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు, చెర్లోపల్లి గ్రామాల్లో ఐసీఏఆర్, న్యూఢిల్లీ సహకారంతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులను చైతన్య పరిచారు. రైతు సంక్షేమ కార్యక్రమాల కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం పలువురు రైతులకు భూసార పరీక్ష పత్రాలు, ఇద్దరు అభ్యుదయ రైతులకు కంది విత్తనాలు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో రేకులకుంట ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఏరువాక శాష్త్రవేత్త రామసుబ్బయ్య, ఏడీఏ సనావుల్లా, రైతులు పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం
● పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
పుట్టపర్తిటౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మంగళవారం పుట్టపర్తిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాబోవు రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు సాగిస్తామన్నారు.

ఆరు టన్నుల చీనీ కాయల అపహరణ

ఆరు టన్నుల చీనీ కాయల అపహరణ