
చైతన్య పాఠశాల ఎదుట ధర్నా
కదిరి అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కదిరిలోని శ్రీచైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఆ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యాపారం చేస్తున్న పాఠశాలపై విద్యాశాఖాధికారులు తనిఖీలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఆన్లైన్ ద్వారా శ్రీచైతన్య విద్యాసంస్థలు ఇంటికే పుస్తకాలు పంపుతున్నారని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ప్రీ ప్రైమరీ అడ్మిషన్లను చేపట్టారని మండిపడ్డారు. సీబీఎస్సీ, ఇంటర్నేషనల్ విద్య పేరుతో రూ.లక్షల మేర ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం పాఠశాలలో ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ధర్నాలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మహేంద్ర, నాగార్జున, బాబ్జాన్, గణేష్, అఖిల్, మహేష్నాయక్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఫర్నీచర్ ధ్వంసంపై సమాచారం అందుకున్న సీఐ నారాయణరెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించారు. స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు విద్యార్థి సంఘాల నాయకులపై కేసు నమోదు చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా ఎస్ఎఫ్ఐ మహేంద్ర, బాబ్జాన్, ఎంఎస్ఎఫ్ సాకే హరి, నాగరాజు, ఏఐఎస్ఎఫ్ గణేష్, ఎంఎస్ఎఫ్ సోము, రాజుతో పాటు మరో 10 మంది పాఠశాలలో అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు.
ఫర్నీచర్ ధ్వంసం చేసిన విద్యార్థి సంఘం నాయకులు