
ఖజానా శాఖలో బదిలీలు
అనంతపురం అర్బన్: జిల్లా ఖజానా శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం జారీ చేశారు. 20 మంది సీనియర్ అకౌంటెంట్లు, తొమ్మిది మంది జూనియర్ అకౌంటెంట్లు, 11 మంది అటెండర్లు, నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను బదిలీ చేస్తూ ఇతర ప్రాంతాలకు పోస్టింగ్ ఇచ్చారు.
వ్యవసాయ శాఖలో...
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయ శాఖలో నలుగురు సీనియర్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న ఎం. నాగమణిని, నంద్యాలలో పనిచేస్తున్న ప్రవీష్కుమార్ను అనంతపురంలోని డీఏఓ కార్యాలయానికి బదిలీ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న సునీతను డీడీఏ(ఎస్సీ) కార్యాలయానికి, అనంతపురంలో పనిచేస్తున్న మధుమతిని హిందూపురం ఏడీఏ కార్యాలయానికి బదిలీ చేశారు.
ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో వంచకుడికి రిమాండ్
కదిరి టౌన్: యువతిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో వంచకుడిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. కదిరి సీఐ వి.నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. కదిరి పట్టణానికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లికి చెందిన ప్రకాష్ లోబర్చుకున్నాడు. శారీరక అవసరాలు తీర్చుకున్న అనంతరం పెళ్లికి నిరాకరిస్తూ వేధించసాగాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఈ నెల 3న కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం కదిరిలోని హిందూపురం మార్గంలో ఉన్న గట్లు వద్ద ప్రకాష్ను గుర్తించి అరెస్ట్ చేసి, అనంతపురంలోని న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.
వంద శాతం లక్ష్యాలను
చేరుకోవాలి : డీఎంహెచ్ఓ
పుట్టపర్తి అర్బన్: నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు వైద్య పరీక్షలు, టీకాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సంబంధిత అధికారులను డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్బేగం ఆదేశించారు. టీకాల కార్యక్రమంపై సోమవారం తన చాంబర్లో వైద్యాధికారులు, సిబ్బందితో ఆమె సమీక్షించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ నాగరాజు, ఎస్ఓ కళాధర్, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, బాలాజీనాయక్ , వైద్యాధికారులు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
తల్లీకొడుకు అదృశ్యం
కదిరి టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో స్థానిక అడపాలవీధికి చెందిన షేక్ నజీమా, తన రెండేళ్ల వయసున్న కుమారుడితో కలసి ఈ నెల 2న ఇల్లు విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి గాలింపు చేపట్టినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లి షేక్ షబానా ఫిర్యాదు మేరకు సోమవారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. కాగా, గతంలోనూ ఆమె తన కొడుకును తీసుకెళ్లి 10 రోజుల తరువాత తిరిగి వచ్చినట్లుగా తల్లి పేర్కొనడం గమనార్హం.
పాము కాటుతో వ్యక్తి మృతి
సోమందేపల్లి: మండలంలోని చాలకూరు గ్రామానికి చెందిన ఆదినారాయణ (40) పాము కాటుతో మృతిచెందాడు. రొద్దం మండలం చెరుకూరు గ్రామం వద్ద మామిడి తోటలో కూలి పనులకు ఆదివారం వెళ్లాడు. సోమవారం ఉదయం పని ప్రాంతంలో పాము కాటు వేయడంతో పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆదినారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సెల్ టవర్ ఎక్కి హల్చల్
తనకల్లు: స్థానిక 42వ జాతీయ రహదారి పక్కనే బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ను సోమవారం రాత్రి ఆషిక్ అనే యువకుడు ఎక్కి హల్చల్ చేశాడు. దాదాపు వంద అడుగులు ఎత్తు ఉన్న టవర్ చివరి భాగానికి చేరుకుని అక్కడే కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. పోలీసులు టవర్ వద్దకు చేరుకుని కిందికి దిగి రావాలని పదే పదే కోరినా అతడు స్పందించలేదు. దీంతో చాలా సేపు పోలీసులు టవర్ వద్దే వేచి చూసి చివరకు పక్కకు వెళ్లారు. పోలీసులు లేరని తెలుసుకున్న యువకుడు తనంతకు తాను టవర్ దిగి వెళ్లిపోయాడు.
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
రాప్తాడు: ప్రమాదవశాత్తు రైలు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... పామిడి మండలం రామరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్డే నారాయణ (82) 15 ఏళ్లుగా చిన్మయనగర్ సమీపంలోని పంచాయతీరాజ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఉన్న సిమెంట్ పెల్లల పరిశ్రమలో 12 ఏళ్లుగా కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంత కాలంగా ఫిట్స్ రావడం, మతి స్థిమితం సరిగ్గా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాప్తాడులో పని ఉందంటూ బయలుదేరిన ఆయన పండమేరు వంక రైల్వే వంతెనపై వెళుతుండగా వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొంది. ఘటనలో ఎగిరి పట్టాల పక్కన పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ధర్మవరం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి చిన్న కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.