
‘నారాయణ’లో పాఠ్య పుస్తకాల గది సీజ్
హిందూపురం టౌన్: స్థానిక నారాయణ ఒలంపియాడ్ స్కూల్లో సోమవారం ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రి విక్రయిస్తుండగా ఎంఈఓ గంగప్ప గుర్తించి సీజ్ చేశారు. కాగా, ఇదే అంశంపై సోమవారం ఉదయం ఎస్ఎఫ్ఐ, ఎస్ఎస్యూఐ ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల వద్ద ధర్నా జరిగింది. పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు, విద్యా సామగ్రి విక్రయిస్తుండడంతో విద్యార్ధి సంఘాల నాయకులు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎంఈఓ వాటిని పరిశీలించి, విద్యా సామాగ్రి నిల్వ చేసిన గదిని సీజ్ చేశారు. పట్టణంలోని నారాయణ, చైతన్య, భాష్యం పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని, పాఠ్య పుస్తకాల పేరుతో అక్రమంగా వేలాది రూపాయలు ఫీ వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, జిల్లా అధ్యక్షుడు సురేష్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఆఫ్రిద్, ఎన్ఎస్యూఐ పట్టణ అధ్యక్షుడు భరత్, అజ్మల్, ఉమేష్, చింటూ, మోరియా, ఇస్మాయిల్, కుశాల్ తదితరులు పాల్గొన్నారు.