
బాలికపై అత్యాచారం అమానుషం
అనంతపురం అర్బన్: రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై జరిగిన అత్యాచారం అమానుషమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ అన్నారు. శనివారం అనంతపురంలోని గణేనాయక్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటనకు కారణమైన వారు ఏ పార్టీకి చెందినవారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. పేదరికాన్ని, సామాజిక వెనుకబాటును అవకాశంగా తీసుకుని దళిత బాలికపై ఆరు నెలలుగా 14 మంది అత్యాచారానికి పాల్పడడం సభ్య సమాజానికే సిగ్గుచేటన్నారు. నిస్సహాయ బాధిత బాలికకు అండగా నిలవాల్సిన సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకోవడం నిందితులకే తోడ్పుతుందనే విషయం గుర్తించాలన్నారు. ఈ దుర్మార్గ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఎద్దుల బండిని ఢీకొన్న ఐచర్ వాహనం
● రైతుకు తీవ్ర గాయాలు
బత్తలపల్లి: వేల్పుమడుగు క్రాస్ సమీపంలో ఎద్దులబండిని ఐషర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే ఘటనలో రెండు ఎద్దులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన రైతు వీరనారప్ప శనివారం తెల్లవారుజామున వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దుల బండితో బత్తలపల్లి మండలం వేల్పమడుగు గ్రామానికి బయల్దేరాడు. వేల్పుమడుగు క్రాస్ సమీపంలోకి రాగానే ధర్మవరం నుంచి బత్తలపల్లి వైపు వేగంగా వస్తున్న ఐచర్ వాహనం ఎద్దుల బండిని వెనుక వైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు వీరనారప్ప ఎద్దుల బండిలో నుంచి ఎగిరి అల్లంత దూరంలో పడిపోవడంతో నడుములు విరిగాయి. ఎద్దులు సైతం గాయపడ్డాయి. ఎద్దుల బండి ధ్వంసమైంది. ఇటుకల బట్టీ వద్దనున్న కూలీలు అప్రమత్తమై వాహనాన్ని కొంత దూరం వెంబడించినట్లు తెలిసింది. అయితే వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. రైతును బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దర్శన టికెట్లపై
అర్చకుల అభ్యంతరం
గుత్తి: తొండపాడు బొలికొండ రంగనాఽథస్వామి దర్శనానికి టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టడంపై అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాలయం వద్ద శనివారం అర్చకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు, భక్తులు అధికంగా దైవ దర్శనానికి వస్తారన్నారు. కరువుకు నిలయమైన ఇలాంటి ప్రాంతంలో దైవ దర్శనానికి టికెట్ల విధానం అమలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అదీగాక అధికారులు ఏకపక్షంగా టికెట్ల విధానం అమలు చేయడానికి సిద్ధమయ్యారన్నారు. కనీసం అర్చకులు, గ్రామ పెద్దలను కూడా సంప్రదించలేదన్నారు. వెంటనే టికెట్ల విధానం యోచనను విరమించుకోవాలన్నారు.

బాలికపై అత్యాచారం అమానుషం

బాలికపై అత్యాచారం అమానుషం