
అలకబూని.. ఇంటినుంచి వెళ్లిపోయిన విద్యార్థి
● పట్టుకొచ్చి తల్లిదండ్రులకు
అప్పగించిన పోలీసులు
ధర్మవరం అర్బన్: ఎంసెట్ మార్కుల విషయంలో తల్లిదండ్రులు మందలించారని ఓ విద్యార్థి అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని వెతికి పట్టుకొచ్చి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని టీచర్స్కాలనీకి చెందిన నారాయణస్వామి కుమారుడు రాజు ఇటీవల ఎంసెట్ రాశాడు. పరీక్ష కీ ఆధారంగా 35 మార్కులు వచ్చాయి. సరిగా చదవలేదంటూ తల్లిదండ్రులు మందలించడంతో అలిగిన రాజు శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తెలిసిన చోట్లల్లా వెదికినా ఎక్కడా కనపడలేదు. శనివారం ఉదయం టూటౌన్ సీఐ రెడ్డప్పకు ఫిర్యాదు చేశారు. ఆయన తన సిబ్బందితో గాలింపు చేపట్టి విద్యార్థి తన స్నేహితుడు ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని, పట్టుకొచ్చి తండ్రి నారాయణస్వామికి విద్యార్థిని అప్పగించారు.
ఘర్షణలో యువకుడి మృతి
గార్లదిన్నె: ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, 108 సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెనకచెర్ల గ్రామానికి చెందిన దివాకర్, యశ్వంత్ శనివారం ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన దివాకర్ కట్టెతో దాడి చేయడంతో యశ్వంత్ (18) స్పృహతప్పి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని యశ్వంత్ను అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి యశ్వంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘర్షణకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

అలకబూని.. ఇంటినుంచి వెళ్లిపోయిన విద్యార్థి