
ఆర్ఎంపీ అనుమానాస్పద మృతి ● పెన్నహోబిలం గుట్టల్లో కాలిన
మృతదేహం గుర్తింపు
ఉరవకొండ: ఓ ఆర్ఎంపీ అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం సిద్దారాంపురం గ్రామానికి చెందిన ఆవుల గోపాలరెడ్డి, సువర్ణమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు మంజునాథ్రెడ్డి ఉన్నారు. కుమారుడు గ్రామంలోనే ఆర్ఎంపీగా గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ భారం మంజునాథరెడ్డి (30)పై పడింది. కుమార్తెకు వివాహం కావడంతో కుమారుడికి పెళ్లి చేయాలని తల్లి సంబంధాలు చూస్తోంది. అయితే సంబంధాలు ఏవీ కుదరకపోవడంతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులతో చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక జీవితంపై విరక్తి పెంచుకున్న మంజునాథ్ ఈ నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ నెల 5న కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉరవకొండ మండలం పెన్నహోబిలం గుట్టల్లో కాలిపోయిన ఓ మృతదేహాన్ని గమనించిన స్థానికుల సమాచారంతో సీఐ మహనంది, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పెన్నహోబిలంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం ఆధారంగా మృతుడిని మంజునాథ్గా అనుమానిస్తూ సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.