
వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలకు కృతజ్ఞతలు
పెనుకొండ రూరల్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో కార్యక్రమానికి తరలివచ్చారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ వేల సంఖ్యలో ప్రజల మద్దతుతో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగిందన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అన్నింటిలో ఘోరంగా విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను వంచించడంతో ఏడాది కాలంలోనే ప్రజలు ఉద్యమబాట పట్టారన్నారు.
సక్రమంగా విద్యుత్ సరఫరా
ధర్మవరం: విద్యుత్ అంతరాయాన్ని నివారించి సక్రమంగా విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యుత్ సీజీఎం వరకుమార్ తెలిపారు. ధర్మవరం సబ్ డివిజన్లోని సబ్స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాలి, వర్షం వచ్చే సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లను పదిరోజుల్లో పరిష్కరించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. పాత ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతు చేయించడం, కొత్త ట్రాన్స్ఫార్మర్లను వెంటనే ఏర్పాటు చేయడం తదితర వాటిని సత్వరమే చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లపై ప్రత్యేక దృష్టిని సారించాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలుంటే 1912కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
భూసేకరణ వేగవంతం చేయండి
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఇంధన ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమైన భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కాన్ఫరెన్స్ హాల్లో ఇంధన ప్రాజెక్ట్ భూసేకరణ సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో కొన్ని వేల మెగావాట్ల పునరుత్పాదన ఇంధన ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమైన భూమిని సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారులు వారి పరిధిలోని మండలాల్లో అందుబాటులో ఎంత భూమి ఉంది అన్న వివరాలను వెంటనే సేకరించి నివేదించాలన్నారు. ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమైన భూమిని ఇచ్చే రైతులకు ఎకరా భూమికి ఏడాదికి రూ.31 వేలు ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల హాకీ జట్టు ఎంపిక
ధర్మవరం: హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ భీమవరంలో జరగనున్న 15వ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా మహిళల హాకీ జట్టును ఎంపిక చేసినట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బంధనాథం సూర్యప్రకాష్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం జిల్లా జూనియర్ మహిళల హాకీ జట్టును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మహిళల హాకీ జట్టు క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాకీ జిల్లా ఉపాధ్యక్షుడు గౌరిప్రసాద్, సభ్యులు జెన్నే చంద్రశేఖర్, ఉడుముల కిరణ్, సత్యసాయి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్ హస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
జట్టు సభ్యులు: సింధు (కెప్టెన్),పవిత్ర, మధురిమబాయ్, వైష్ణవి, హేమ, దివ్య, నసీమా, వర్ష, హర్షిత, నవ్యశ్రీ, దుర్గ, శివగంగా, శ్రీలేఖ, మోక్షిత, గుణశ్రీ, వరలక్ష్మి, ఉషశ్రీ, హర్షితలు.
కోచ్: మారుతీకుమార్, మేనేజర్ అరవింద్గౌడ్

వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలకు కృతజ్ఞతలు

వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలకు కృతజ్ఞతలు