
ఎస్ఏ పదోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురంం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో భాగంగా ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లగా పదోన్నతులు కల్పించేందుకు గురువారం సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ, మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ యాజమాన్యాల పాఠశాలల టీచర్లు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున 1:2 ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచామని విద్యాశాఖ అధికారులు చెప్పినా...మొత్తం 382 పోస్టులు ఖాళీలుంటే, 372 మంది ఎస్జీటీలు రావడం విశేషం. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లు బదిలీ ఉత్తర్వుల కోసం ఎదురుచూశారు.
మొత్తం 4,589 మంది దరఖాస్తు..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,589 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 2,456 మంది తప్పనిసరి, 2,133 మంది టీచర్లు రెక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే..,. బయలాజికల్ సైన్స్ 631 మంది, ఇంగ్లిష్ 656 మంది, హిందీ 383 మంది, కన్నడ ముగ్గురు, గణితం 847 మంది, పీడీలు 262 మంది, ఫిజికల్ సైన్స్ 616 మంది, సంస్కృతం ఏడుగురు, సోషల్ 544 మంది, స్పెషల్ ఎడ్యుకేషన్ 37 మంది, తెలుగు 584 మంది, ఉర్దూ 19 మంది దరఖాస్తు చేసుకున్నారు.