
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పుట్టపర్తి టౌన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. అనంతరం పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ అందరి సహకారంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని నివాసం, కార్యాలయ ఆవరణలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరి ఉందన్నారు. పర్యావరణంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు మరొకరికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఆర్ఐలు వలి, మహేష్, డీసీఆర్బి సీఐ శ్రీనివాసులుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్: పర్యావరణానికి హాని కలిగిస్తే ఆరోగ్యానికి ముప్పు తప్పదని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం పుట్టపర్తిలోని డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రశాంతి గ్రామం వరకూ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ ప్రతికూలతలు , ప్లాస్టిక్ వాడకం, విష రసాయానాల విడుదల తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. విస్తారంగా మొక్కలు పెంచాలన్నారు. ప్లాస్టిక్ వాడకంతో నేల క్షీణిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సమత, వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.