
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
● జిల్లా పరిశీలకులుగా జేడీ సుబ్బారావు
అనంతపురం ఎడ్యుకేషన్: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 8 కేంద్రాలు, బెంగళూరులో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ రెండు విడతలుగా ఈనెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. డీఈఓ పరిధిలోని కేంద్రాలకు పరిశీలకులుగా జాయింట్ డైరెక్టర్ సుబ్బారావును నియమించారు. పరీక్షలయ్యేదాకా ఆయన ఇక్కడే ఉంటూ పరీక్ష కేంద్రాలను పరిశీలించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అన్ని కేంద్రాలకు డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అభ్యర్థులు గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.
పరీక్ష కేంద్రం పరిశీలన
పుట్టపర్తిటౌన్: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జరిగే డీఎస్సీ పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం బీడుపల్లి వద్ద ఉన్న సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ రత్న , డీఎస్పీ విజయకుమార్, రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుందన్నారు. డీఎస్పీ, 12 మంది సీఐలు, ఎస్ఐలతో పాటు 130 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.