
వర్షాలతో ఒక్కరికీ ఇబ్బంది కలగకూడదు
● అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ చేతన్
పుట్టపర్తి టౌన్: ఈసారి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, వర్షాల వల్ల ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటి పారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా చూడాలన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు చేయించాలన్నారు. వ్యాధులు విజృభించకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలన్నారు. మెరుపులు, పిడుగుల సమాచారం ముందస్తు అందించాలన్నారు.
మాన్యం భూములను పరిరక్షించాలి
జిల్లాలోని వివిధ దేవాలయాల మాన్యం భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని కలెక్టర్ చేతన్ దేవదాయశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్నతో కలిసి దేవదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మాన్యం భూములపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. ధర్మవరం డివిజన్లోనే మాన్యం భూములు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని కాపాడాలన్నారు.