
వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు నిదర్శనం
ధర్మవరం అర్బన్: కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ధర్మవరంలో కొలువైన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం అత్యంత పురాతనమైనదిగా ప్రసిద్ధి చెందింది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. క్రీ.శ.950లో కీచక మహామునీశ్వరుడు ఉదయాద్రి మీద తపస్సు చేసి హంపి నుంచి చెన్నకేశవస్వామి మూలవిరాట్ను తీసుకు వచ్చి ఇక్కడ ప్రతిష్టించినట్లుగా ఆధారాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతున్నారు. అనంతరం హరిహర బుక్కరాయల పాలనలో సామంతరాజులు క్రియాశక్తి వడియార్ ధర్మవరంలో చెరువును తవ్వించారు. అలాగే రామగిరి మండలం కుంటిమద్ది వద్ద ఓ రైతు పొలం దున్నుతుండగా భూనీల సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలు లభ్యమయ్యాయి. అదే సమయంలో క్రియాశక్తి వడియార్కు స్వామి కళలో కనిపించి ధర్మాంబపురం (ప్రస్తుతం ధర్మవరం) ఆలయంలో ప్రతిష్టించమని అదృశ్యం కావడంతో వాటిని తీసుకువచ్చి తూర్పు దిశగా బ్రాహ్మణవీధిలో లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో ప్రతిష్టించారు. దేవాలయం ఏర్పడినప్పటి నుంచి అర్చకత్వం వంశపారంపర్యంగా రావడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా కోనేరాచార్యులు, అర్చకులుగా మకరందబాబు, భానుప్రకాష్ నిత్య పూజలు చేస్తున్నారు. 2013వ సంవత్సరంలో దాతలు, టీటీడీ సహకారంతో రూ.60లక్షల వ్యయంతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేశారు. వివాహాలు చేసేందుకు వీలుగా కల్యాణ మంటపాన్ని నిర్మించారు.
ఏటా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల సప్తమి నుంచి బహుళ విదియ వరకు ధర్మవరంలో అత్యంత వైభవంగా లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. 11రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణోత్సవం అనంతరం బ్రహ్మ రథంపై స్వామిని ఊరేగిస్తారు. ఈ ఉత్సవానికి ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలతో పాటు బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు, కడప తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రథోత్సవం అనంతరం మూడురోజుల పాటు గ్రామ దేవత దుర్గమ్మ పరుష వైభవంగా నిర్వహిస్తారు.
స్వామి పాదాలను తాకే సూర్యకిరణాలు
ఏటా మాఘమాసంలో మొదటిరోజు సూర్యకిరణాలు చెన్నకేశవస్వామి మూలవిరాట్ పాదాలను తాకుతాయి. రెండో రోజు స్వామి వక్షస్థలాన్ని, మూడోరోజు మూలవిరాట్ మొత్తం సూర్యకిరణాలు తాకుతాయి. మిగిలిన రోజుల్లో సూర్యకిరణాలు స్వామిని తాకవు. ధనుర్మాసంలో నెల రోజులపాటు స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. వైకుంఠ ఏకాదశికి దక్షిణ, ఉత్తర ద్వారాల ద్వారా భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశికి వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు.
క్రీ.శ.950లో నిర్మించిన ఆలయం
భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న లక్ష్మీచెన్నకేశవస్వామి
ధర్మవరంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు..
10న బ్రహ్మ రథోత్సవం
ఉత్సవాలకు తరలిరండి
ధర్మవరం పట్టణంలో నిర్వహించే లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే కోరిన కోర్కెలు తీరుతాయి అని భక్తుల నమ్మకం. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం కావడంతో ఇక్కడి లక్ష్మీచెన్నకేశవస్వామి చాలా మహిమాన్వితుడిగా కొలుస్తుంటారు. వాహన సేవలకు సంబంధించి కొత్తవి తయారు చేయించారు.
– వెంకటేశులు, ఆలయ ఈఓ
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు...
ధర్మవరంలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 4న ధ్వజారోహణం, 5న ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనంలో స్వామి ఊరేగుతారు. 6న ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం సింహ వాహనం, 7న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం హనుమద్వాహనం, 8న ఉదయం పల్లకీ ఉత్సవం, సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవం ఉంటాయి. 9న ఉదయం గరుడోత్సవం, సాయంత్రం శేష వాహనం, రాత్రి గజ వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. 10న ఉదయం 7 గంటలకు మడుగుతేరు (రథోత్సవం) లాగుతారు. అనంతరం సాయంత్రం వరకు స్వామిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ధూళోత్సవం ఉంటుంది. 11న సాయంత్రం అశ్వవాహనం, 12న ఉదయం పుష్ప మంటపం, 10 గంటలకు వసంతోత్సవం, సాయంత్రం 6 గంటలకు హంస వాహన సేవలు ఉంటాయి. 13న ఉదయం పుష్ప యాగం, సాయంత్రం దేవతా ఉద్వాసన, 14న సాయంత్రం శయనోత్సవం (ఏకాంత సేవ)తో ఉత్సవాలు ముగుస్తాయి.

వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు నిదర్శనం

వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు నిదర్శనం

వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు నిదర్శనం