
గ్రానైట్ తవ్వకాలతో నష్టపోతున్నాం
● విజిలెన్స్, మైనింగ్ అధికారుల ఎదుట రైతుల ఆవేదన
రొళ్ల: గ్రానైట్ తవ్వకాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని విజిలెన్స్, మైనింగ్ అధికారుల ఎదుట రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. రొళ్ల మండలం గుడ్డగుర్కి పంచాయతీ పరిధిలోని గొట్టుగుర్కి గ్రామ సమీపాన సర్వే నంబర్లు 152, 157తో పాటు 93లోని బద్ధికొండ, మాలకొండల్లో చేపట్టిన గ్రానైట్ తవ్వకాల పనులను గనులశాఖ, విజిలెన్స్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా మైనింగ్, విజిలెన్స్ అధికారులు గ్రానైట్ తవ్వకానికి ఎంత వరకు అనుమతి ఉంది, ఎంత మేరకు తవ్వారు. రాయల్టీ ఎంత చెల్లించారు అనే విషయాలపై ఆరా తీశారు. కొందరు రైతులు మాట్లాడుతూ... బద్ధికొండ, మాలకొండల్లో చేపట్టిన గ్రానైట్ తవ్వకాల వల్ల తాము తీవ్రంగా నష్ట పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బద్ధికొండను ఆనుకుని వందలాది ఎకరాల సాగు భూమితో పాటు చెక్డ్యాంలు, కుంటలు, కట్టలు, వ్యవసాయ బోరుబావులు, సారవంతమైన భూములు ఉన్నాయన్నారు. అంతే కాక గ్రానైట్ తవ్వకం వల్ల జరిగిన నష్టానికి ఇప్పటి వరకూ పరిహారం కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకుని గ్రానైట్ తవ్వకాల పనులు నిలిపి వేయాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాయల్టీ చెల్లించకుండా గ్రానైట్ తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని గనులశాఖ (మైనింగ్) అధికారులు ఖాజాహుస్సేన్, పురుషోత్తం, సునీతతో పాటు విజిలెన్స్ అధికారులు నాగభూషణ్, జమాల్బాషా, వాసుప్రకాష్ తదితరులు హెచ్చరించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వీఆర్వో రంగనాథ్, మైనింగ్, విజిలెన్స్తో పాటు రెవెన్యూశాఖ సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
గ్రంథాలయాలు... విజ్ఞాన కేంద్రాలు
అనంతపురం: గ్రంథాలయాలు భవిష్యత్తు తరాలకు విజ్ఞాన కేంద్రాలని పర్సన్ ఇన్చార్జ్ హోదాలో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధి అంశంపై జిల్లాలోని 79 గ్రంథాలయాధికారులతో కలసి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం ఆయన సమీక్షించారు. నిర్ణీత సమయానికి గ్రంథాలయాలు తెరచి ఉంచాలన్నారు. గ్రంథాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. గ్రంథాలయా పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ వారి నుంచి నిర్ణీత సమయంలో పన్నులు రాబట్టాలన్నారు. గ్రంథాలయాలను ఆదర్శంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాలపై పాఠకులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారిలో స్వచ్ఛందంగా సేవ చేసే దృక్పథం ఉన్న వారిని రీసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేయాలన్నారు. వీరి నుంచి గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థులకు డ్రాయింగ్, నృత్యం, పెయింటింగ్, సంగీత వాయిద్యాల శిక్షణ అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రెటరీ పి. రమ తదితరులు పాల్గొన్నారు.
బీసీ గురుకులాల కన్వీనర్గా అష్రత్వలి
అనంతపురం ఎడ్యుకేషన్: మహాత్మ జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల కన్వీనర్గా కొనకొండ్ల గురుకుల పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు జి.అష్రత్వలి నియమితులయ్యారు. ప్రస్తుతం కన్వీనర్గా పనిచేస్తున్న కేజే జోనాథన్ గత నెల 29న పదవీవిరమణ పొందారు. ఈ క్రమంలో అష్రత్వలికి జిల్లా కన్వీనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.