తెలంగాణ సీఎం పీఎస్‌గా శ్రీనివాసరాజు | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎం పీఎస్‌గా శ్రీనివాసరాజు

May 1 2025 12:22 AM | Updated on May 1 2025 12:22 AM

తెలంగాణ సీఎం పీఎస్‌గా శ్రీనివాసరాజు

తెలంగాణ సీఎం పీఎస్‌గా శ్రీనివాసరాజు

పరిగి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్‌ పూర్వ విద్యార్థి కేఎస్‌ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు మండలంలోని ఈసలాపురం గ్రామానికి చెందిన కేఎస్‌ శ్రీనివాసరాజు 1976లో ఏపీఆర్‌ఎస్‌ కొడిగెనహళ్లిలో 8వ తరగతిలో ప్రవేశం పొంది 1978–79 విద్యాసంవత్సంలో పదో తరగతిని పూర్తి చేశారు. అనంతరం ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన... గ్రూప్‌–1 ఆఫీసర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అంచలంచెలుగా ఎదుగుతూ ఐఏఎస్‌ దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా పని చేశారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో 2011 నుంచి దాదాపు 99 నెలల పాటు జేఈఓగా పనిచేసి రాష్ట్రంలోనే ఖ్యాతి గడించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన్ను కేంద్రం తెలంగాణకు కేటాయించడంతో తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణపొందారు. ఆ తర్వాత ఆయన సేవలను మెచ్చిన తెలంగాణ ప్రభుత్వం 2024 జూలై నుంచి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా అవకాశం కల్పించింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా నియమితులయ్యారు.

ఏపీఆర్‌ఎస్‌ ఉపాధ్యాయ బృందం హర్షం

ఏపీఆర్‌ఎస్‌లో చదివిన విద్యార్థుల్లో చాలా మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా ఎదగడంతో పాటు దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిల్లో ఉండటం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్‌ మురళీధర్‌బాబు అన్నారు. కాగా ఏపీఆర్‌ఎస్‌కు చెందిన మరో పూర్వ విద్యార్థి రామకృష్ణారావు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీనివాసరావు తెలంగాణ సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా నియమితులుకావడంతో ప్రిన్సిపాల్‌తో పాటు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ఏపీఆర్‌ఎస్‌ పూర్వ విద్యార్థికి దక్కిన గౌరవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement