● యూట్యూబ్ ఛానెల్
నిర్వాహకుడిపై ఫిర్యాదు
బిట్రగుంట: కావలి కేంద్రంగా సోషల్ మీడియాలో యాదవ సామాజికవర్గాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్న యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడిపై బోగోలు జెడ్పీటీసీ సభ్యురాలు మద్దిబోయిన కీర్తన బిట్రగుంట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. కావలికి చెందిన చిలకపాటి మధు అనే వ్యక్తి సీఎండీ న్యూస్ ఛానెల్ పేరుతో ఏర్పాటు చేసి యాదవులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. జర్నలిస్ట్ల పేరుతో కావలి కేంద్రంగా ఎన్నో యూట్యూబ్ ఛానెళ్లు, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తూ యాదవ సామాజికవర్గాన్ని కించపరచడమే లక్ష్యంగా ఈ ముఠా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇటీవల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు యాదవ్పై సైతం ఇదే తరహాలో సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వైరల్ చేశారని గుర్తుచేశారు. రఘు చనిపోయాడంటూ అర్ధరాత్రి సమయంలో వాట్సాప్లో తప్పుడు కథనాలు వైరల్ చేశారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. పోలీసులు ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కాగా అంతకుముందు కీర్తన నివాసం వద్ద వీరరఘు, స్థానిక యాదవ సామాజికవర్గ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చిలకపాటి మధును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ విలేకరులకు కూడా పోలీసులు వంతపాడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలోనూ ఈ ముఠా తప్పుడు వ్యవహరాలపై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.


