ముత్తుకూరు(పొదలకూరు): రెండునెలలపాటు కొనసాగిన చేపల వేట నిషేధ కాలం ముగిసింది. ముత్తుకూరు మండల తీర ప్రాంతాల మత్స్యకారులు పడవలు, వలలు, వేట సామగ్రితో వేటకు బయలుదేరారు. నేలటూరుపాళెం, కృష్ణపట్న ం గ్రామాలకు చెందిన మత్స్యకారులు వేటను పునః ప్రారంభించారు. సముద్రంలో చేపల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు ప్రభుత్వం వేటపై నిషేధం విధిస్తుంది. ఈ సమయంలో మత్స్యకారులు బోట్ల మరమ్మతులు, ఇంజిన్లను సరిచేయడం, వలల తయారీ, ఇతర సామగ్రి సిద్ధం చేసుకోవడం వంటి పనులు పూర్తి చేసుకున్నారు. నిషేధ సమయం పూర్తవుతుందునగా బోట్లకు డీజిల్, ఐస్, ఆహార సామగ్రిని సమకూర్చుకున్నారు. తీరానికి చేరుకున్న మత్స్యకారులు సముద్ర దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు రోజువారీ వేటకు వెళ్లగా, మరికొందరు రెండు నుంచి నాలుగు వారాల పాటు సముద్రంలోనే ఉండి వేట సాగించనున్నారు. రెండు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకార కుటుంబాలు వేట ప్రారంభంతో ఊరట చెందుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే పీతలు, రొయ్యలు, వివిధ రకాల చేపలు అధికంగా లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. రెండు నెలల విరామం తర్వాత తీర ప్రాంతాల్లో మళ్లీ బోట్ల శబ్దాలతో సందడి నెలకొంది.


