
మోటార్బైక్ను తప్పించబోయి..
వెంకటాచలం: ఎదురుగా వచ్చిన మోటార్బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఆరుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు పంచాయతీ మల్లుగుంటసంఘం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఇడిమేపల్లి పంచాయతీ పలుకూరువారిపాళెం గ్రామానికి చెందిన పలువురు వ్యవసాయ కూలీలు వరినాట్లు వేసేందుకు ఆటోలో జోసఫ్పేటకు బయలుదేరారు. ఆటో మల్లిగుంటసంఘానికి చేరుకోగానే బైక్ ఎదురుగా అడ్డు వచ్చింది. ఆటో డ్రైవర్ బైక్ను తప్పించబోయాడు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడి పడింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న మల్లి లక్ష్మీదేవమ్మ (55)తోపాటు, మరో ఆరుగురు మహిళలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే ట్రాక్టర్లో సర్వేపల్లిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. లక్ష్మీదేవమ్మకు తీవ్ర రక్తగాయాలు కావడంతో మృతిచెందింది. గాయాలపాలైన మహిళలు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. లక్ష్మీదేవమ్మ మృతిచెందిందనే విషయం తెలియడంతో ఆమె భర్త తిరుపాలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సర్వేపల్లికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా పడి మహిళా కూలీ మృతి
ఆరుగురికి గాయాలు