
హేచరీ యాజమాన్యంపై కేసు
● బాల కార్మికుడికి గాయాలవడంతోనే..
ఉలవపాడు: హేచరీలో పనిచేస్తున్న బాల కార్మికుడికి గాయాలవడంతో యాజమాన్యంపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. అనకాపల్లి జిల్లా వయకరంపల్లి మండలం ఈదటం గ్రామానికి చెందిన ఓ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. అతడి స్నేహితుడు నాగేష్ ఉలవపాడు మండల పరిధిలోని అలగాయపాళెం వద్ద ఉన్న శ్రీనివాస హేచరీలో పనిచేస్తున్నాడు. అతడితోపాటు సెలవుల్లో పని చేయడానికి బాలుడు మే 3వ తేదీన వచ్చాడు. 27వ తేదీన రొయ్య పిల్లలు పెంచే ట్యాంక్లు శుభ్రం చేసి యాసిడ్ బకెట్తో నిచ్చెన దిగుతున్న సమయంలో బాలుడు కింద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. బకెట్లో ఉన్న యాసిడ్ కళ్లలో పడి మంటలు రావడంతో యాజమాన్యం కందుకూరులోని పంటవారిపాళెంలో చూపించి ఇంటికి పంపించింది. తల్లిదండ్రులు బాలుడిని తుని హాస్పిటల్లో చూపించగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. తుని వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా లేబర్ ఇన్స్పెక్టర్ సుజాత, ఎస్సై అంకమ్మ వెళ్లి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. 18 ఏళ్లలోపు బాలుడిని పనిలో పెట్టుకున్నందుకు హేచరీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఇంకా ఎవరైనా బాల కార్మికులు ఉన్నారా అని తనిఖీ చేశారు.