
ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు పోటీలు
ఉదయగిరి: మండలంలోని గన్నేపల్లి పంచాయతీలో అడవి పేరంటాలమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎడ్ల బండలాగుడు పోటీలను చివరి రోజు గురువారం నిర్వహించారు. ఇందులో కడప జిల్లాకు చెందిన ఎడ్లు సత్తా చాటాయి. బద్వేలు మండలం కుమ్మరికుంటకు చెందిన వినుకొండ రసూల్ ఎడ్లు నిర్దేశించిన సమయంలో 1862 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో.. అదే జిల్లా రొక్కువారిపల్లెకు చెందిన ఓబుల్రెడ్డి ఎడ్లు 1515.5 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీరికి వరుసగా రూ.35 వేలు, రూ.25 వేల నగదు బహుమతిని ఆలయ కమిటీ అందజేసింది. బందోబస్తును ఎస్సైలు ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసులు ఏర్పాటు చేశారు.