
న్యాయం జరగలేదంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు: ఇంటి విషయమై సమీప బంధువులతో ఎనిమిది నెలలుగా గొడవ జరుగుతున్నా, పోలీస్స్టేషన్లో తనకు న్యాయం దక్కలేదని.. సంగం సీఐ వేమారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చేజర్ల మండలం ఆదూరుపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి బంధువుల వివరాల మేరకు.. ఆదూరుపల్లిలోని సర్వే నంబర్ 590లో ఇంటి స్థలం, పట్టాను షరీఫాబీకి 2009లో ప్రభుత్వం అందజేసింది. అప్పటి నుంచి ఇంటి పన్నులు చెల్లిస్తూ, ఆమె తన పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆమె మృతి చెందగా, కుమార్తె జమీలా అదే ఇంట్లో ఉంటున్నారు. షరీఫాబీ చెల్లెలు మగ్బూల్కు సర్వే నంబర్ 490లో ఇచ్చిన పట్టాను 590గా ఫోర్జరీ చేసి ఆ స్థలం తనదంటూ కోర్టు నుంచి తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్ను పది నెలల క్రితం తెచ్చుకున్నారు. ఈ తరుణంలో జమీలా, కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో సామగ్రిని బయటపడేసి ఆక్రమించేందుకు యత్నించారు. గమనించిన జమీలా కుమారుడు హర్షద్ ప్రశ్నించగా, అతనిపై దాడి చేసి గాయపర్చారు. దీనిపై చేజర్ల పోలీసులు, సీఐకి ఫిర్యాదు చేశారు. అయితే కొందరు టీడీపీ నేతల మాటలను సీఐ విని జమీలా ఇంటికి తాళాలేసి తన వద్దే ఉంచుకున్నారు. దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేసి ఆయన సూచనల మేరకు చేజర్ల తహసీల్దార్కు అర్జీని బాధితురాలు అందజేశారు. విచారణ జరిపి పట్టా మేరకు ఆ ఇల్లు షరీఫాబీకే చెందిందని, ఆమె వారసురాలైన జమీలాకు అక్కడ నివసించే హక్కు ఉందంటూ ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఈ విషయాలను ఎస్సై తిరుమలరావుకు బాధితురాలు తెలియజేశారు. దీంతో ఫోర్జరీపై మగ్బూల్, ఆమె కుటుంబసభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ తరుణంలో బాధితులు తమ ఇంట్లోకి వెళ్తుండగా, సీఐ సూచనలతో మగ్బూల్ ఆమె బంధువులు దాడి చేసేందుకు వచ్చారు. దీంతో తమ కుటుంబానికి రక్షణ లేదనే మనస్తాపంతో సూపర్ వాస్మాల్ 33 మందును సేవిస్తూ సెల్ఫీ వీడియోలో అన్యాయాన్ని వివరించారు. కొద్దిసేపటి అనంతరం ఆమె కుమారుడు, బంధువులు వచ్చి వైద్యం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.