
పట్టణ ప్రజలపై ఇంటి పన్నుల భారం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలపై ఇంటి పన్నుల భారం మోపారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ హామీలు మాత్రం నెరవేర్చలేపోయారు’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు, పట్టణ నివాస ప్రాంతాల సమన్వయ కమిటీ కన్వీనర్ మాదాల వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలోని బాలాజీనగర్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలపై 20 శాతం ఇంటి పన్నులు పెంచటంతోపాటు, విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి పీక్ అవర్స్లో అదనపు చార్జీలు వేస్తోందన్నారు. ఇంటి పన్ను విధానాన్ని గతంలోలా రెంటల్ పద్ధతిలో అమలు చేయాలని చూస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతామన్నారు. అనంతరం ‘స్మార్ట్ మీటర్లు వద్దు.. కరెంట్ చార్జీలు తగ్గించాలి’ స్టిక్కర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సింహపురి పౌరసమాఖ్య నగర కార్యదర్శి అత్తిమూరు శ్రీనివాసులు, నాయకులు సూర్యనారాయణ, ఆసిఫ్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.