
ముగిసిన చెస్ ర్యాంకింగ్ పోటీలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): తెలుగు రాష్ట్రాల ఓపెన్ చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. ముత్తుకూరు రోడ్డులోని సద్గురు సిల్వర్ ఓక్స్ స్కూల్లో జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ఫన్ పార్క్ ఎండీ సాయి పొత్తూరి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతపురానికి చెందిన శామ్యూల్ స్టీఫెన్ మొదటి ర్యాంక్, హైదరాబాద్కు చెందిన అక్షయ్ కుమార్ రెండో ర్యాంక్, నెల్లూరుకు చెందిన హరిరామ్ సాయికృష్ణ మూడో ర్యాంక్, రామ్లిఖిత్ నాలుగో ర్యాంక్, గిరిబాబు ఐదో ర్యాంక్ సాధించారు. వ్యాపారవేత్త పచ్చిపులుసు శ్రీరాములు, ఘుమఘుమలు రెస్టారెంట్ అధినేత ఎస్.కల్యాణ్, చెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వై.సుమన్లు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్, స్కూల్ డైరెక్టర్లు షణ్ముకచారి, వెంకటాద్రి నాయుడు, శ్రీఆనంద్ వింగ్స్ చెస్ అకాడమీ డైరెక్టర్ ఎం.గోపీనాథ్, కోచ్ డాక్టర్ మధుసూదన్, జేసీస్ జోనల్ వైస్ చైర్మన్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.