మహిళల ప్రపంచ నంబర్వన్, స్టార్ క్రీడాకారిణి అరీనా సబలెంకా బెదిరింపులకు దిగింది. గ్రాండ్స్లామ్ టోర్నీల్లో తమకు ఎక్కువ మొత్తంలో షేర్ ఇవ్వకపోతే ఆ టోర్నీలను ఆటగాళ్లు బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చింది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ప్రైజ్మనీ విషయంలో ఇటలీ స్టార్ జానిక్ సిన్నర్.. 'ప్రైజ్మనీ విషయంలో పూర్తి నిరాశతో ఉన్నా' అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా సిన్నర్కు సబలెంకా మద్దతుగా నిలుస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఆటగాళ్లకు ఆదాయంలో వాటా పెరగకపోతే మేము గ్రాండ్స్లామ్ టోర్నీలను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆటగాళ్లు అందుకున్న షేర్కు, చూపెడుతున్న లెక్కలకు సంబంధం ఉండడం లేదు. అందుకే ఆటగాళ్లకు పక్కగా ఆదాయంలో ఎక్కువ వాటాను ఇవ్వాలి. ఒకవేళ మేము బహిష్కరిస్తే టోర్నీలు జరగకపోవచ్చు.
అదే జరిగితే మా నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులు మిస్ అవుతారు. కనీసం మాతో చర్చలు జరిపి ఆటగాళ్లు సంతోషపడే విధంగా ఆదాయంలో వాటా విషయమై ఒక ముగింపు ఇస్తారని ఆశిస్తున్నా' అని చెప్పుకొచ్చింది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఓపెన్ ప్రైజ్మనీపై అగ్రశ్రేణి ఆటగాళ్లు జానిక్ సిన్నర్, కోకో గాఫ్, స్వియాటెక్, జొకోవిచ్, జ్వెరెవ్, మెద్వెదెవ్ సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తం ప్రైజ్మనీ సుమారు పది శాతం మేర పెరిగి 61.7 యూరో మిలియన్లకు చేరుకుందని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఆటగాళ్లు మాత్రం ఫ్రెంచ్ ఓపెన్లో ఆటగాళ్లకు ఆదాయంలో అందించే వాటా 15.5 నుంచి 14.9 శాతానికి తగ్గిందని విమర్శిస్తున్నారు. ఇక ఈ సీజన్లో తొలి గ్రాండ్స్లామ్ అయిన ఫ్రెంచ్ ఓపెన్ మే 18 నుంచి జూన్ 7 వరకు జరగనుంది.


