చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్తాన్‌ ప్రతాపం | Pakistan women cricket team beat zimbabwe | Sakshi
Sakshi News home page

చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్తాన్‌ ప్రతాపం

May 4 2026 10:54 PM | Updated on May 4 2026 10:54 PM

Pakistan women cricket team beat zimbabwe

జింబాబ్వే మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి పాకిస్తాన్‌లో పర్యటిస్తుంది. ఈ చారిత్రక పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు జింబాబ్వేపై ప్రతాపం చూపింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 168 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ సదాఫ్‌ షమాస్‌ (98) తృటిలో సెంచరీ మిస్‌ కాగా.. మరో ఓపెనర్‌ గుల్‌ ఫిరోజా (50), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సిద్రా అమీన్‌ (67), మిడిలార్డర్‌ బ్యాటర్‌ నజిహా అల్వి (56 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. 

మిగతా బ్యాటర్లలో అయేషా జాఫర్‌ 3, ఆలియా రియాజ్‌ 2, కెప్టెన్‌ ఫాతిమా సనా 11 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ప్రెసియస్‌ మరంగే 3 వికెట్లతో రాణించగా.. కుద్జాయ్‌ చిగోరా, కెప్టెన్‌ నోమ్వెలో సిబండ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పసికూన జింబాబ్వే చేతులెత్తేసింది. బిలవ్డ్‌ బిజా (53) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఓపెనర్‌ కెలిస్‌ (31) ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. మిగతా ప్లేయర్లలో కెల్లీ (11), మెలిండ (10), సిబండ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

పాక్‌ బౌలర్లలో ఫాతిమా సనా, తస్మియా రుబాబ్‌, సయ్యదా ఆరూబ్‌ షా తలో 2 వికెట్లు పడగొట్టగా.. మొమినా రియాసత్‌, నష్రా సంధు చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇదే కరాచీ వేదికగా మే 6న జరుగనుంది. కాగా, వన్డే సిరీస్‌ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా జరుగనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement