IPL 2022: ఆ డబ్బుతో మొదట ఐఫోన్, సెకండ్ హాండ్ కారు కొన్నా.. అందులో ఏసీ లేదు: సిరాజ్
Published
Tue, Feb 1 2022 1:49 PM
Mohammed Siraj Comments Goes Viral: ఎంతో మంది యువ క్రికెటర్లలాగే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సైతం ఐపీఎల్లో ప్రతిభను నిరూపించుకుని టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం జాతీయ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. చాలా మంది ఆటగాళ్ల మాదిరిగానే సిరాజ్ జీవితమేమీ పూలపాన్పు కాదు. అతడి తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేసే వారు. అయినప్పటికీ... ఎంతో కష్టపడి కొడుకును ప్రయోజకుడిని చేశారు.
ఇక 2017లో సన్రైజర్స్ హైదరాబాద్ సిరాజ్ను కొనుగోలు చేసినప్పటికీ... 2018 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని సొంతం చేసుకున్న తర్వాతే జీవితం మారిపోయింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు సిరాజ్. కాగా ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో ఆర్సీబీ కోహ్లి(రూ.15 కోట్లు)... గ్లెన్ మ్యాక్స్వెల్ (రూ. 11 కోట్లు)తో పాటు సిరాజ్ (రూ. 7 కోట్లు)ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్న ఆక్షన్కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రమోషన్లు చేపట్టిన ఆర్సీబీ... ఓ పాడ్కాస్ట్ ట్రెయిలర్ను రిలీజ్ చేసింది. ఇందులో సిరాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్కు ఎంపికైన తర్వాత తను మొదటగా కొనుగోలు చేసిన వస్తువులేమిటో తెలిపాడు. సిరాజ్ మాట్లాడుతూ... ‘‘మొదటగా నేను ఐఫోన్ 7+ కొన్నాను. ఆ తర్వాత ఓ సెకండ్ హ్యాండ్ కార్. కరోలా(టయోటా). ఎందుకంటే ఐపీఎల్ ఆడే వాళ్లకు కారు ఉండాలి కదా! ఎంతకాలమని ప్లాటినా(బైక్) మీద తిరగుతాను. అందుకే కారు కొన్నా.
నిజానికి నాకు డ్రైవింగ్ రాదు. మా అంకుల్ వాళ్ల కొడుకుకు డ్రైవింగ్ తెలుసు. అందుకే నేను బయటికి వెళ్లిన ప్రతిసారి పాపం తననే తీసుకువెళ్లేవాడిని’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘నిజానికి నా కారులో ఏసీ లేదు. అందుకే బయటకు వెళ్లినపుడల్లా కిటికీలు తెరిచే ఉండేవి. నా అభిమానులు నన్ను గుర్తుపట్టి చీర్ చేసేవాళ్లు. ఎంతో సంతోషంగా అనిపించేది. ఆ తర్వాత ఏడాదికి మెర్సిడెస్ కొన్నాను’’ అని సిరాజ్ తన అనుభవాలు పంచుకున్నాడు.