ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
రోహిత్, రికెల్టన్ ఊచకోత
229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోయారు. రోహిత్ శర్మ (83), రికెల్టన్ (84) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరు తొలి వికెట్కు 10.5 ఓవర్లలో ఏకంగా 143 పరుగులు జోడించి గెలుపు ఖాయం చేశారు. అనంతరం తిలక్ వర్మ (11), సూర్యకుమార్ యాదవ్ (12) తక్కువ స్కోర్లకే ఔటైనా, నమన్ ధిర్ (23 నాటౌట్), విల్ జాక్స్ (10 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో మణిమారన్ సిద్దార్థ్ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, మొహిసిన్ ఖాన్ తలో వికెట్ తీశారు..
పూరన్ విధ్వంసం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63; ఫోర్, 8 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, సిక్స్), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడారు.
మిగతా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ 13, కెప్టెన్ పంత్ 15, అరంగేట్రం ఆటగాడు అక్షత్ రఘువంశీ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2 వికెట్లు తీయగా.. ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.


