వరుసగా ఆరో పరాజయం | Indian mens hockey team loses again | Sakshi
Sakshi News home page

వరుసగా ఆరో పరాజయం

Jun 16 2025 2:39 AM | Updated on Jun 16 2025 2:39 AM

Indian mens hockey team loses again

మళ్లీ ఓడిన భారత పురుషుల హాకీ జట్టు

ఆధిక్యంలోకి వెళ్లి వెనుకంజ

కెరీర్‌లో 400వ మ్యాచ్‌ ఆడిన మన్‌ప్రీత్‌

ఆంట్‌వర్ప్‌ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) యూరోపియన్‌ అంచె ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. హార్దిక్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టు యూరోపియన్‌ అంచెలో వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. ఆ్రస్టేలియా జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్‌తో రెండు మ్యాచ్‌ల్లో, అర్జెంటీనాతో రెండు మ్యాచ్‌ల్లో, ఆ్రస్టేలియాతో ఒక మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి  పాలైంది. 

ఆ్రస్టేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు మ్యాచ్‌ మొదలైన మూడో నిమిషంలోనే ఖాతా తెరిచింది. సంజయ్‌ చేసిన గోల్‌తో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆధిక్యంలోకి వెళ్లామన్న ఆనందం భారత్‌కు మరుసటి నిమిషంలోనే ఆవిరైంది. రెండు నిమిషాల వ్యవధిలో ఆస్ట్రేలియా రెండు గోల్స్‌ చేసి భారత్‌కు షాక్‌ ఇచి్చంది. నాలుగో నిమిషంలో టిమ్‌ బ్రాండ్, ఐదో నిమిషంలో బ్లేక్‌ గోవర్స్‌ ఆస్ట్రేలియాకు ఒక్కో గోల్‌ అందించారు. రెండో క్వార్టర్‌లో భారత్‌ మూడో గోల్‌ సమర్పించుకుంది. 

18వ నిమిషంలో కూపర్‌ బర్న్స్‌ గోల్‌తో ఆస్ట్రేలియా 3–1తో ముందంజ వేసింది. మూడో క్వార్టర్‌లో దిల్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌తో భారత్‌ ఈ ఆధిక్యాన్ని 2–3కు తగ్గించింది. అనంతరం భారత జట్టు స్కోరును సమం చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ్రస్టేలియా చివరి పది నిమిషాల్లో మూడు పెనాల్టీ కార్నర్‌లు సంపాదించినా భారత గోల్‌కీపర్‌ కృషన్‌ బహదూర్‌ పాఠక్‌ నిర్వీర్యం చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో భారత జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు రాగా ఒక్క దానిని సద్వినియోగం చేసుకుంది. 

మరోవైపు ఆ్రస్టేలియాకు ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు రాగా ఆ జట్టు కూడా ఒక్క దానిని లక్ష్యానికి చేర్చింది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా భారత మాజీ కెప్టెన్, మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌లో 400 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న 2024–2025 ప్రొ లీగ్‌లో భారత జట్టు 14 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి, తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడింది. 15 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. భారత జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌లను బెల్జియం జట్టుతో (జూన్‌ 21న, 22న) ఆడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement