భారీ విజయంతో భారత్‌ బోణీ  | India Begin Campaign With 13-0 Win Over Namibia | Sakshi
Sakshi News home page

భారీ విజయంతో భారత్‌ బోణీ 

Dec 2 2025 12:55 AM | Updated on Dec 2 2025 12:55 AM

 India Begin Campaign With 13-0 Win Over Namibia

తొలి మ్యాచ్‌లో 13–0తో నమీబియాపై గెలుపు  

సాంటియాగో (చిలీ): జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో జ్యోతి సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు 13–0 గోల్స్‌ తేడాతో నమీబియా జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున హీనా బానో (35వ, 35వ, 45వ నిమిషాల్లో), కనిక సివాచ్‌ (12వ, 30వ, 45వ నిమిషాల్లో) మూడు గోల్స్‌ చొప్పున సాధించారు. సాక్షి రాణా (10వ, 23వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేసింది. 

బినిమా ధన్‌ (14వ నిమిషంలో), సోనమ్‌ (14వ నిమిషంలో), సాక్షి శుక్లా (27వ నిమిషంలో), ఇషిక (36వ నిమిషంలో), మనీషా (60వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. మ్యాచ్‌ మొత్తంలో భారత్‌కు 11 పెనాల్టీ కార్నర్‌లు లభించగా... నమీబియాకు ఒక్క పెనాల్టీ కార్నర్‌ కూడా రాలేదు. భారత్‌ 11 పెనాల్టీ కార్నర్‌లలో ఐదింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. అన్నింటిని లక్ష్యానికి చేరిస్తే విజయం అంతరం మరింత భారీగా ఉండేది. గ్రూప్‌ ‘సి’లోని మరో మ్యాచ్‌లో జర్మనీ 7–1తో ఐర్లాండ్‌ను ఓడించింది. రేపు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో జర్మనీతో భారత్‌ తలపడుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement