ఆసియా కప్‌, బంగ్లాదేశ్‌ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..? | BCCI Planning To Cancel Asia Cup 2025 And Bangladesh Tour Amid Pahalgam Terror Attack Says Reports | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌, బంగ్లాదేశ్‌ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..?

May 2 2025 3:48 PM | Updated on May 2 2025 3:57 PM

BCCI Planning To Cancel Asia Cup 2025 And Bangladesh Tour Amid Pahalgam Terror Attack Says Reports

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది స్వదేశంలో (సెప్టెంబర్‌) జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో పాకిస్తాన్‌ పాల్గొనాల్సి ఉండటంతో ఈ మేరకు నిర్ణయించినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ తెలిపింది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌ సహా 8 జట్లు పాల్గొనాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుందని ఏసీసీ (ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌) నిర్ణయించింది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగాల్సి ఉంది. ఈ టోర్నీకి భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నేరుగా అర్హత సాధించగా.. హాంగ్‌కాంగ్‌, ఒమన్‌, యూఏఈ 2024 ఏసీసీ ప్రీమియర్‌ కప్‌ ద్వారా క్వాలిఫై అయ్యాయి.

బంగ్లాదేశ్‌ పర్యటన కూడా రద్దు..?
అక్రమ చోరబాట్లు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ బంగ్లాదేశ్‌ పర్యటనను కూడా క్యాన్సిల్‌ చేసుకోనుందని సమాచారం. ఎఫ్‌టీపీ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ పర్యటన రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్‌ జరుగనుంది. ఆగస్ట్‌ 17న తొలి వన్డే, 20న రెండో వన్డే ఢా​కా వేదికగా జరగాల్సి ఉంది. ఆతర్వాత ఆగస్ట్‌ 23న మూడో వన్డే, 26న తొలి టీ20 చట్టోగ్రామ్‌లో జరగాల్సి ఉన్నాయి. చివరి రెండు టీ20లు ఆగస్ట్‌ 29, 31 తేదీలోల​ ఢాకాలో జరగాల్సి ఉన్నాయి.

కాగా, ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల ప్రశాంత బైసరన్‌ లోయలో పాక్‌ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉ‍గ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.  పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. 

సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో భారత్‌ పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. పాక్‌తో ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌ల రద్దును కొనసాగించింది. ఆ దేశ ట్విటర్‌, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను బ్యాన్‌ చేసింది. పాక్‌కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్‌కు సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement