
రైల్వే శాఖ ప్రతిపాదన
● జహీరాబాద్, కోహీర్లలో అండర్ బ్రిడ్జిలు/ ఫ్లైఓవర్లు నిర్మాణాల కోసం పరిశీలన ● కొనసాగుతున్న సాయిల్ టెస్టింగ్ పనులు ● శాశ్వతంగా తీరనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతంలో ఎనిమిది వంతెనల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రతిపాదించింది. కాపలాదారు గేట్లను మూసేసి మ్యాన్ పవర్ను తగ్గించుకోవడంతో పాటు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వేగేట్ల వద్ద సాయిల్ టెస్టింగ్ పనులను చేపట్టింది. మెర్క్యూరీ ఈ కాం అనే ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. వారి ఆధ్వర్యంలో రైల్వే గేట్ల వద్ద డ్రిల్లింగ్ పనులు చేపట్టి సాయిల్ టెస్టింగ్ కోసం శాంపిళ్లను సేకరిస్తోంది. అధికంగా రద్దీ ఉండే జహీరాబాద్–బీదర్ రహదారిపై కుష్టు నివారణ కేంద్రం వద్ద గల రైల్వే గేటు, కోహీర్ పట్టణంలో తాండూర్ రహదారిపై ఉన్న రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జిని నిర్మించాలా లేక ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలా అనే దానిపై రైల్వే శాఖ ఇంకా ఒక నిర్ణయానికి రాలేనట్లు తెలిసింది. అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు అనుకూలంగా లేనట్లయితే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించే విషయాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం. ప్రజల వైపు నుంచి మాత్రం ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలనే డిమాండ్ ఉంది. కోహీర్–నాగిరెడ్డిపల్లి రహదారిపై ఉన్న గేటుతో పాటు పైడిగుమ్మల్ వెళ్లే దారిలో ఉన్న గేటు వద్ద అండర్ బ్రిడ్జిలను నిర్మించనుంది. కోహీర్–పోతిరెడ్డిపల్లి రహదారిపై ఉన్న గేటు వద్ద అండర్ బ్రిడ్జిని నిర్మించడమా లేక నాగిరెడ్డిపల్లి గేటు వద్ద నుంచి సర్వీస్ రోడ్డు నిర్మించి అనుసంధానం చేయడమా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. హుగ్గెల్లి–పిచరాగడి గేటు వద్ద, న్యాల్కల్ మండలంలోని మెటల్కుంట, బసంత్పూర్ గేట్ల వద్ద అండర్ బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇప్పటికే నాగిరెడ్డిపల్లి, పైడిగుమ్మల్ వెళ్లే గేట్లతో పాటు కోహీర్ రైల్వేగేటు వద్ద సాయిల్ టెస్టింగ్ పనులను పూర్తి చేసింది. మిగిలిన రైల్వే కాపలాదారు గేట్ల వద్ద సాయిల్ టెస్టింగ్ పనులను నిర్వహించనుంది. సాయిల్ శాంపిళ్ల సేకరించి ఏయే ప్రాంతాల్లో ఎంత మేర తవ్వకాలు జరిపితే గట్టిదనం వస్తుంది, ఎంత లోతులో రౌతు లభిస్తుంది, ఇందు కోసం ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలనే దానిపై స్పష్టత వస్తుంది. తదనంతరం అంచనాలతో నిర్మాణం పనులకు ప్రతిపాదించనుంది.
8 వంతెనల నిర్మాణం!