
గాయపడ్డ నెమలికి చికిత్స
శివ్వంపేట(నర్సాపూర్): గాయపడిన నెమలికి అటవీ సిబ్బంది చికిత్స చేయించారు. గురువారం మండల పరిధిలోని గోమారం గ్రామ శివారులో వెంకట్రెడ్డికి చెందిన పౌల్ట్రీ పామ్ వద్ద ఓ నెమలి గాయపడి ఉండగా గుర్తించిన రైతు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శివ్వంపేట ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రీధర్కుమార్, బీట్ అధికారి శ్రీవల్లి గాయపడిన నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నెమలికి నర్సాపూర్లో పశు వైద్యశాలలో చికిత్స చేయించి అడవిలో వదిలిపెట్టారు.
పురుగుల మందు తాగి
వ్యక్తి ఆత్మహత్య
గజ్వేల్రూరల్: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మాదగారి రేగొండకు భార్య మంజులతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రోజు మాదిరిగానే భార్యాభర్తలు వ్యవసాయ పొలానికి వెళ్లారు. మంజుల పొలంలో పనిచేస్తుండగా, రేగొండ సమీపంలోని చింతచెట్టుకింద పడుకున్నాడు. మంజుల కొద్దిసేపటి తర్వాత రేగొండ వద్దకు వెళ్లి చూడగా పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించింది. అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఆర్టీసీ సేవల్ని
వినియోగించుకోవాలి
మాజీ సర్పంచ్ స్వరూప
చిలప్చెడ్(నర్సాపూర్): ఆర్టీసీ బస్ సేవల్ని గ్రామ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు వినియోగించుకోవాలని మాజీ సర్పంచ్ స్వరూప సూచించారు. నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ చిలప్చెడ్ మండలం గౌతాపూర్ గ్రామానికి రాగా, గ్రామస్తులు దానిని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ...గతంలో గ్రామానికి బస్ సౌకర్యం ఉండేదని కొద్దికాలంగా గౌతాపూర్తోపాటు, పలు గ్రామాలకు ఆర్టీసీ రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయన్నారు. దీనిపై ఆర్టీసీ సేవల్ని పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులను, పలుమార్లు కోరడంతో తిరిగి గ్రామానికి బస్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు విఠల్, భీమయ్య, రమేశ్నాయక్, యాసిన్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
పేకాట రాయుళ్ల అరెస్ట్
మెదక్ మున్సిపాలిటీ: పేకాట ఆడుతున్న వారి ని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ సీఐ రాజారెడ్డి వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నా రు. వారి నుంచి 5 మొబైల్స్, రూ. 8,765 నగదు ను స్వాధీనం చేసుకుని మెదక్ టౌన్ ఎస్ఐకి అప్పగించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దాడి చేసినట్లు తెలిపారు.
తూప్రాన్లో..
తూప్రాన్: పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రంగాకృష్ణ వివరాల ప్రకారం... అల్లాపూర్ సమీపంలో ఓ వెంచర్లో పేకాటాడుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10700, మూడు బైకులు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.