
సముద్రంలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
ముంబైలో ఘటన
రామాయంపేట(మెదక్): పట్టణానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు ముంబైలోని సముద్రం అలల్లో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధిత కుటుంబం వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన టంకరి రాము (34)కు భార్య సరితతోపాటు ఎనిమిదేళ్లలోపు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ముంబైలో ఉంటున్న తన సోదరి ఇటీవల రామాయంపేటకు వచ్చారు. సోదరితో పాటు రెండు రోజుల క్రితం రాము కూడా ముంబై వెళ్లాడు. ఆదివారం సాయంత్రం అక్క, పిల్లలతో కలిసి సముద్రంలో బోటు షికారు చేశాడు. రాము బోటు దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా వచ్చిన అలల్లో సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సమీపంలో ఉన్న పోలీసులు అతన్ని బయటకు తీసేలోగా మృతి చెందాడు. ఈ విషయంపై ఉదయం రామాయంపేటకు సమాచారం రాగా అతని తల్లి భార్యాపిల్లలు బోరున విలపించారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.