
మానవత్వం చాటుకున్న ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించి జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం కొల్చారం పోలీస్ స్టేషన్ పర్యటన ముగించుకొని ఎస్పీ వస్తున్న క్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని తన వెంట ఉన్న క్యూఆర్టీ సిబ్బందితో పోలీస్ వాహనంలో చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
26 మందికి జరిమానా
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి వారం రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 26మంది పట్టుబడ్డారు. వారిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.40వేల జరిమానా విధించారు.
పాఠశాలలో
కంప్యూటర్లు మాయం
హుస్నాబాద్: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు కంప్యూటర్లు మాయమయ్యాయి. పాఠశాలకు మంజూరైన 10 కంప్యూటర్లను పైఅంతస్తులో ల్యాబ్ గదిలో ఉంచారు. వీటిని ఇంకా ప్రారంభించలేదు. వేసవి సెలవులు కావడంతో పాఠశాలకు తాళం వేసి ఉంచారు. పాఠశాలల పునఃప్రారంభం గురువారం రెండు కంప్యూటర్లు మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య మాట్లాడుతూ పాఠశాల కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయని, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై డీఈఓకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోళ్ల ఫారంలో అగ్నిప్రమాదం
ఝరాసంగం(జహీరాబాద్): ప్రమాదవశాత్తు కోళ్ల ఫారంలో అగ్నిప్రమాదం సంభవించింది. బాధితుడు శ్రీశైలం కథనం ప్రకారం... మండల పరిధిలోని పార్యవరం గ్రామానికి చెందిన శ్రీశైలం మూడు కొన్నేళ్లుగా గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలం వద్ద పౌల్ట్రీ పామ్ను ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్తు వైర్లు, కోళ్ల దాణా, డ్రింకర్లు, ఫీడర్లు, కాలిపోయాయి. సుమారు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపాడు. షెడ్డు తగులబెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
మనోహరాబాద్(తూప్రాన్): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ వివరాల ప్రకారం... మండలంలోని వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నబత్తుల ఆంజనేయులు(32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం పొలానికి వెళ్లిన ఆంజనేయులు సాయంత్రమైన ఇంటికి రాలేదు. కాగా శుక్రవారం ఉదయం గ్రామ శివారులో అడవి పక్కన ఓ చెట్టుకు ఊరి వేసుకుని కనిపించాడు. కాగా మృతుని భార్య నవనీత భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. ఇంటి వద్ద కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తుందని పోలీసుల ఫిర్యాదులో తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది.